హావిూల అమలులో ప్రభుత్వం విఫలం : డిసిసి

ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజలకు ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చేప్పిన కేసీఆర్‌ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా పేదలకు స్వయం ఉపాధి కింద రుణాలు ఇస్తామన్న ప్రభుత్వం ఒక్కరికీ ఇవ్వలేదన్నారు. ఆసరా పింఛన్లలో అందిరినీ మోసం చేసిందన్నారు. భారీ వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయిన రైతులను పూర్తి స్థాయిలో ఆదుకునే చర్యలు ప్రభుత్వం చేపట్టాలని కోరారు. అరకొర పరిహారం అందించి చేతులు దులుపుకునే పద్ధతి అవలంబించ వద్దన్నారు. పంట నష్టపోయిన బాధిత రైతులకు ధీమా కల్పించాలన్నారు. ప్రకృతి ఆగ్రహానికి రైతులు బలి అవుతున్నారన్నారు. భారీ వర్షాలు జలశయాలను నిండినా చేతికందే పంటలను దెబ్బతీశాయన్నారు. వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పంట పెట్టుబడికి సరిపోయే విధంగా పరిహారం అందిస్తే కుదరదన్నారు. మొక్కబడిగా కాకుండా ఆదుకునే విధంగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. అధికారులు ప్రతి బాధితుడిని గుర్తించి జాబితాలో చేర్చాలన్నారు.