హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా..  దత్తాత్రేయ ప్రమాణం

– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధరమ్‌చంద్‌ చౌదరి
సిమ్లా, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  హిమాచల్‌ ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ బుధవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. సిమ్లాలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధరమ్‌ చంద్‌ చౌదరి ప్రమాణం చేయించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం జైరాం ఠాకూర్‌, ఆ రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, దత్తాత్రేయ కుటుంబసభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ 27వ గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సంస్కృతిలో భాగంగా ధరించే హిమాచలీ క్యాప్‌ను సీఎం ఠాకూర్‌ మంగళవారం నూతన గవర్నర్‌కు అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా క్యాప్‌ను ధరించి దత్తాత్రేయ ప్రమాణం చేశారు. అంతకుముందు రాష్ట్రమంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు దత్తాత్రేయకు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉంటే భాజపా నేతలు డి.కె. అరుణ, వివేక్‌, రామచంద్రారెడ్డి తదితరులతో కలిసి దత్తాత్రేయ మంగళవారమే ప్రత్యేక విమానంలో హిమాచల్‌ ప్రదేశ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియమ నిబంధనలకు అనుగుణంగాతన బాధ్యతలను నిర్వర్తిస్తానని అన్నారు.
13న దత్తాత్రేయకు సన్మానం..
హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు రవీంద్రభారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలి పౌర సన్మానసభ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. సన్మానసభకు ముఖ్యఅతిథిగా కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం తదితరులు హాజరవుతారని తెలిపారు.