హుస్నాబాద్‌లో బండి సంజయ్‌ ముగింపు సభ

హాజరు కానున్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ
హుస్నాబాద్‌,సెప్టెంబర్‌30  (జనం సాక్షి) : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన తొలిదశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను గాంధీ జయంతి రోజైన శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ పట్టణంలో నిర్వహించనున్నారు. దాదాపు లక్ష మందితో నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. గాంధీ జయంతిని పురస్కరించుకొని శనివారం ఉదయం 10.30గంటలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి బండి సంజయ్‌ హుస్నాబాద్‌లోని గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి ప్రచార రథంలో పట్టణంలో రోడ్‌షో నిర్వహిస్తూ ప్రజా సంగ్రామ యాత్ర తొలిదశ పాదయాత్రను విజయవంతం చేసిన ప్రజానీకానికి ధన్యవాధాలు చెబుతారు. మధ్యాహ్నం 12 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిర్వహించే బహిరంగ సభలో సంజయ్‌ ప్రసంగిస్తారు.