హెల్త్‌ సిటీగా వరంగల్‌ అభివృద్ది

ఎంజిఎంలో సిటి స్కాన్‌ ప్రారంభం
పేదలకు అందుబాటులోకి కార్పోరేట్‌ వైద్యం
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వెల్లడి
వరంగల్‌,మే24(జ‌నంసాక్షి): తెలంగాణలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ది చెందుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడిరచారు. వైద్యానికి సెం కెసిఆర్‌ ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తూ ఆస్పత్రులను అభివృద్ది చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా వరంగల్‌ ఎంజీఎంను తీర్చిదిద్దుతామని మంత్రి ఎర్రబెల్లి వెల్లడిరచారు. ఎంజీఎంలోని క్యాజువాలిటీలో 3 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సీటీస్కాన్‌ యంత్రాన్ని ప్రారంభించారు. కొత్త సిటీస్కాన్‌ను ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిటీస్కాన్‌ మిషన్‌ పనితీరు తదితర వివరాలపై సూపరింటెండెంట్‌, టెక్నీషియన్స్‌ను అడిగి తెలుసుకున్నారు.
ఆస్పత్రిలో కాసేపు తిరిగిన మంత్రి.. సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన గురించి అధికారులతో చర్చించారు. వరంగల్‌లో.. దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా మారుతోందన్నారు. మెరుగైన వైద్యం కోసం పేదలు ఆస్తులు, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రాకూడదనే లక్ష్యంలో సర్కారు దవాఖానాల్లోనే నాణ్యమైన వైద్యమందిస్తున్నామని ఎర్రబెల్లి అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోనూ కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రికి కావాల్సిన ఆధునిక సదుపాయాలు, యంత్రాల గురించి వైద్యులతో చర్చించారు. దేశంలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా వరంగల్‌ ఎంజీఎంను తీర్చిదిద్దుతామని మంత్రి అన్నారు. ’వరంగల్‌ ఆస్పత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం. త్వరలో రూ.17 కోట్లతో ఎన్‌ఆర్‌ఐ సేవలు అందుబాటులోకి తీసుకొస్తాం. త్వరలోనే ఎంజీఎంలో 60 ఏళ్లు పైబడిన వారికి మోకాళ్ల శస్త్రచికిత్సలు చేసేలా చర్యలు తీసుకుంటాం. దేశంలోనే తొలిసారిగా 22 అంతస్తుల స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నాం. కార్పొరేట్‌ ఆస్పత్రి ద్వారా ప్రభుత్వ సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంజీఎం ఆస్పత్రిలో ఉన్న సమస్యల గురించి.. ఇంకా కావాల్సిన సదుపాయల గురించి తెలుసుకున్నాను. త్వరలోనే వాటిని ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం, మంత్రి హరీశ్‌రావు పనితనంతో రాష్ట్రం, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. సీఎం కేసీఆర్‌ వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా ప్రకటించారని, హైదరాబాద్‌ తర్వాత ఆ స్థాయి వైద్యసదుపాయాలు వరంగల్‌లో ఏర్పాటవుతున్నా యన్నారు. ఈ సేవలను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. కరోనా సమయంలో ఎంజీఎం వైద్యులు, సిబ్బంది చేసిన సేవలు మరువలేనివని, అదే తరహాలో ఇక్కడ వైద్యసేవలు నిరంతరం అందాలని ప్రజలతో పాటు ప్రభుత్వం కోరుకుంటుందని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఎంజీఎం డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని, అందుకే ఎంజీఎంలు అత్యవసర, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అత్యసవర విభాగంలో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ ద్వారా అత్యవసర చికిత్సలు అందించేందుకు వీలవుతుందన్నారు. ఇప్పటికే ఆసుపత్రులో ఎన్నో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. పాత సెంట్రల్‌ జైలు స్థలంలో రూ.1100కోట్లతో 24 అంతస్తుల అత్యాధునిక మల్టీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయని, త్వరలోనే వరంగల్‌లో ప్రపంచస్థాయి వైద్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, కలెక్టర్‌ గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వలపదాసు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.