హైకోర్టును తప్పుదోవ పట్ఠించిన ఇసి

ప్రభుత్వ ప్రోద్బలమే కారణం: మర్రి
హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  ఎన్నికల కమిషన్‌ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. ఇదంతా తెరాస ప్రభుత్వ ప్రోద్భలంతోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. హైకోర్టును తప్పుదోవ పట్టించేలా చెప్పిన అంశాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఓటర్ల తుది జాబితాను అర్ధరాత్రి విడుదల చేశారంటూ ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫెడరల్‌ ఫ్రంట్‌తో దేశంలో గుణాత్మక మార్పు తెస్తానంటున్న కేసీఆర్‌.. ఇలా ఓటర్ల నమోదులో అవకతవకలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. దేశసమగ్రత కోసం యువత జాగృతం కావాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని ఆయన సూచించారు.  ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఇష్టానుసారంగా చేస్తున్నారని శశిధర్‌రెడ్డి మండిపడ్డారు. ఇష్టం ఉన్న వారి ఓట్లు ఉంచి మిగతావారిని తీసేస్తున్నారని దుయ్యబట్టారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు చేయాలని.. కానీ అలా జరగడం లేదన్నారు.ఓటర్లకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. తాము వేసి కేసు కోర్టులో ఇంకా సజీవంగానే ఉందని.. ఈనెల 31న మరోసారి విచారణకు రానుందని శశిధర్‌రెడ్డి తెలిపారు.