హైదరాబాద్‌ మెట్రోలో జీ5 సేవలు

– తొలుత 10 స్టేషన్‌లలో ప్రారంభించిన ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా లేకుండానే వీడియోలు చూసే అవకాశం కల్పించింది. మెట్రోలో షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌ను మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. షుగర్‌ బాక్స్‌ నెట్‌వర్క్‌తో ఇంటర్నెట్‌ లేకుండానే వీడియోలు చూసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎన్వీఎస్‌ రెడ్డి మాట్లాడుతూ.. తొలుత 10మెట్రోస్టేషన్లలో షుగర్‌ బాక్స్‌ మెట్రో లోకల్‌ వై-ఫై సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మెట్రో రైళ్లలో వినోదం, మేధోసంపత్తిని పెంచే పుస్తకాలు ఉంచాలని కోరామని ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. ఈ యాప్‌తో మూడు నిమిషాల్లో సినిమా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెప్పారు. మెట్రో స్టేషన్లలో ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. జీ5 సేవలను 60 రోజుల వరకు ఉచితంగా అందిస్తామని షుగర్‌ బాక్స్‌ సీఈవో రోహిత్‌ తెలిపారు. తర్వాత ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పారు. ప్రతి రోజు మెట్రోలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగమన్నారు. గేమింగ్‌, ఫుడ్‌, ఈ-కామర్స్‌, ఈ-లెర్నింగ్‌ లాంటివి కూడా అందుబాటులోకి తెస్తామని  వివరించారు.