హోంగార్డుల సేవలు అమోఘం

పోలీసులతో సమానంగా విధుల నిర్వహణజిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌

కొత్తగూడెం,డిసెంబర్‌7 (జనంసాక్షి) :   హోంగార్డులు పోలీస్‌ శాఖతో సమానంగా పనిచేస్తూ ఎంతో గొప్ప సేవలు అందిస్తున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ అన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో గల జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ మైదానంలో మంగళవారం 59వ హోంగార్డ్స్‌ రైజింగ్‌ డే పరేడ్‌ ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ముఖ్యతిథిగా పాల్గొని ప్రసంగించారు. హోంగార్డులు నిత్యం ఎంతో కృషి చేస్తూ పోలీస్‌ శాఖతో సమాన విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. ఒక దృఢ సంల్పంతో ఏర్పడిన హోంగార్డ్స్‌ ఆర్గనైజేషన్‌ సమాజానికి మంచి సేవలనంది స్తుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న హోంగార్డులు తోటి ఉద్యోగుల సమస్యల్లో భాగస్వాములు అవుతూ వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. ఎవరైనా హోంగార్డ్‌ దురదృష్టవశాత్తూ మరణిస్తే తోటి హోంగార్డులు వారి ఒక్కరోజు వేతనాన్ని ఆ కుటుంబానికి కేటాయించడం హర్షణీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ మెరుగైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని తెలిపారు. అనంతరం పరేడ్‌ లో పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అదనపు ఎస్పీ కే.ఆర్‌.కె. ప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ దూలిపాల శ్రీనివాసరావు, పాల్వంచ ఏఎస్పీ బిరుదరాజు రోహిత్‌ రాజు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వర బాబు, ఏఆర్‌ డీఎస్పీ కేవీఆర్‌ సత్యనారాయణ, ఆర్‌ఐలు సుధాకర్‌, తుత్తురు దామోదర్‌, బి. సోములు నాయక్‌, ప్రగడ కామరాజు, సబ్‌ డివిజన్‌ లోని ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.