100కోట్ల ఆఫర్‌ నిజం కాదు

– కేవలం అది జేడీఎస్‌ నేతల భ్రమ
– రూల్స్‌ ప్రకారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
– బీజేపీ కేంద్ర మంత్రి జవదేకర్‌
బెంగళూరు, మే16(జ‌నం సాక్షి) : జేడీఎస్‌ తరపున గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు, మంత్రి ఇవ్వజూపిందని కుమారస్వామి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కొట్టిపారేశారు. రూ. 100 కోట్ల ఆఫర్‌ నిజం కాదన్నారు. కేవలం అది జేడీఎస్‌ నేతల భ్రమ అని పేర్కొన్నారు. తాము రూల్స్‌ ప్రకారం ముందుకు వెళ్తున్నామని.. తమ నిర్ణయాన్ని గవర్నర్‌కు నివేదించామని జవదేకర్‌ చెప్పారు. కర్ణాటకలో తప్పకుండా బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు బీజేపీపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జేడీఎస్‌కు మద్దతిచ్చే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. వారంతా బీజేపీకి భేషరతుగా మద్దతిచ్చేందుకు స్వతహాగా వస్తున్నారని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే హక్కు బీజేపీకే ఉందని, మిగిలిన పార్టీల కంటే బీజేపీకే అత్యధిక స్థానాల్లో ప్రజలు పట్టం గట్టారని, ఇది చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాటానికి అని జవదేవకర్‌ తెలిపారు. కన్నడ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని, రాబోయే ఐదేళ్లలో కన్నడ రాష్ట్ర రూపురేఖలు మార్చుతామని అన్నారు.