100శాతం వీవీప్యాట్‌ స్లిప్పులు లెక్కించలేం

– ఇలాంటి అర్థంలేని పిటిషన్‌ను మేం విచారించబోం
– పిటీషన్‌ను కొట్టేసిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : 100శాతం వీవీప్యాట్లు లెక్కించేలా తీర్పు ఇవ్వమని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసింది. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లతో వీవీప్యాట్‌ స్లిప్పులు 100శాతం సరిపోలేలా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కాగా పిటీషన్‌ తరపు న్యాయవాదులు వాదనలు విన్న సుప్రింకోర్టు 100శాతం వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు చేపట్టలేమని కొట్టేసింది. ఇది అనవసర పిటిషన్‌ అని, దీన్ని మేం విచారించబోమని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. చెన్నైకు చెందిన టెక్‌ ఫర్‌ ఆల్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషన్‌దారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఈ వ్యవహారంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం ఇప్పటికే తీర్పు వెల్లడించింది. మళ్లీ ఎందుకు ఇద్దరు న్యాయమూర్తుల వెకేషన్‌ బెంచ్‌ ముందుకు పిటిషన్‌ తీసుకొచ్చారని ప్రశ్నించింది.  సీజేఐ తీర్పును మేం అధిగమించలేమని, ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకునే పక్రియలో మేం జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఇలాంటి అర్థం లేని పిటిషన్‌ను మేం విచారించబోమని, దీన్ని కొట్టివేస్తున్నామని ధర్మాసం వెల్లడించింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా పరిగణనలోకి తీసుకునే వీవీప్యాట్‌ల సంఖ్యను కనీసం 50శాతానికి పెంచాలంటూ ప్రతిపక్షాలు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు వీవీప్యాట్‌లను లెక్కిస్తే సరిపోతుందంటూ ఏప్రిల్‌లో ఇచ్చిన ఆదేశాలను సవిూక్షించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.