12 నుంచి ఎపి అసెంబ్లీ సమావేశాలు

13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం
14న ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం
అమరావతి,జూన్‌7(జ‌నంసాక్షి): ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈనెల 12 నుంచి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి ప్రకటించారు. ఈనెల 12న ఉదయం 11.05 గంటలకు 15వ అసెంబ్లీ తొలి సమావేశం జరగనుంది. 13న కొత్త సభ్యుల ప్రమాణస్వీకారం, శాసనసభ స్పీకర్‌ ఎన్నిక నిర్వహించనున్నారు. 14న ఉభయసభల సంయుక్త సమావేశంలో సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. మరోవైపు శాసన మండలి సమావేశాలు కూడా 14 నుంచే ప్రారంభం కానున్నాయి.ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన వ్యక్తి శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రొటెం స్పీకర్‌గా విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు నియమితులయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు సచివాలయప్రాంగంలోనే ఉన్న అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్నారు.