13జిల్లాల ప్రజల ఆవేదనకు 13 నిమిషాలేనా..?

– మోడీ ప్రభుత్వ పాలన ఎమర్జెన్సీని తలపిస్తుంది
– విజయవాడలో వెలిసిన ఫ్లెక్సీలు
విజయవాడ, జులై20(జ‌నం సాక్షి) : పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా విజయవాడలో వెలిసిన ప్లెక్సీలు స్థానికంగా కలకలం సృష్టించాయి. తెలుగుదేశం పార్టీకి 13నిమిషాలు మాత్రమే సమయం కేటాయించటాన్ని నిరసిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. 13జిల్లాల ఆంధప్రదేశ్‌ ప్రజల ఆవేదన వినిపించేందుకు 13 నిమిషాల సమయం ఎలా సరిపోతుందని ఫ్లెక్సీలో ప్రశ్నించారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీని
మోడీ మరిపిస్తున్నారని అందులో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి పట్టిన గతే… వచ్చే ఎన్నికల తర్వాత భాజపాకు పడుతుందని హెచ్చరించారు. స్థానిక తెదేపా నేత కాట్రగడ బాబు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై గత మూడు నెలలుగా కాట్రగడ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తన నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా నేడు అవిశ్వాస తీర్మానంపైనా ముఖ్యమైన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.