2న వింటేజ్‌ కార్ల ర్యాలీ

హైదరాబాద్‌ : బీయింగ్‌ ఉమెన్‌ స్వచ్ఛంద సంస్థ, షాదాన్‌ మెడికల్‌ కాలేజీ సంయుక్తంగా ఉమెన్‌ డ్రైవెన్‌ వింటేజ్‌ కార్‌ ర్యాలీని నిర్వహించబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా మహిళలు వింటేజ్‌ కార్లు డ్రైవ్‌ చేస్తూ నిర్వహిస్తోన్న ఈ ర్యాలీని రహదారి భద్రతపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్నామని నిర్వాహకుల్లో ఒకరైన రుచికా శర్మ అన్నారు. ఆగస్టు 2న పీపుల్స్‌ ప్లాజా వద్ద ఈ ర్యాలీ ఉంటుందన్నారు. రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, మహేందర్‌రెడ్డి ఈ ర్యాలీని ప్రారంభించనున్నారు. మై సిటీ మై సేఫ్టీ మై రెస్పాన్సిబిలిటీ నినాదంతో చేపడుతున్న ఈ ర్యాలీలో పాలుపంచుకుంటున్నందుకు ఆనందంగా ఉందని షాదాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ డీన్‌ దినేష్‌ రాజ్‌ మాథుర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌కే ఉమెన్స్‌ మెడికల్‌ కళాశాల డీన్‌ ఏవై చారి పాల్గొన్నారు.