24గంట్లలో 12 లక్షల మందిని..  సురక్షిత ప్రాంతాలకు తరలించాం

– ఫొని తీవ్రతను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం
– ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌
భువనేశ్వర్‌, మే4(జ‌నంసాక్షి):  ఫొని తుఫాన్‌ ప్రభావాన్ని మసర్థవంతంగా ఎదుర్కొన్నామని, ప్రజలను రక్షించేందుకు అనేక చర్యలను చేపట్టామని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. ఈమేరకు ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.. శుక్రవారం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పూరీ వద్ద ఫొని తీరం దాటిన విషయం తెలిసిందే. అయితే అతి తీవ్ర తుఫాన్‌గా మారిన ఫొని.. ప్రళయ బీభత్సం సృష్టిస్తుందని ముందే గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. తుఫాన్‌ రాకకు ముందే కేవలం 24 గంటల వ్యవధిలోనే సుమారు 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం పట్నాయక్‌ తెలిపారు. గంజామ్‌ జిల్లా నుంచి 3.2 లక్షలు, పూరీ నుంచి 1.3 లక్షల మందిని తరలించామని చెప్పారు. రాత్రికి రాత్రే సుమారు 9 వేల షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్నవారికి భోజనం ఏర్పాటు చేసేందుకు 7వేల కిచెన్‌లు పనిచేశాయన్నారు. ఈ భారీ ఆపరేషన్‌ కోసం సుమారు 45 వేల మంది వాలంటీర్లు పనిచేసినట్లు సీఎం వెల్లడించారు. అతి తీవ్ర తుఫాన్‌గా ఒడిశాలో ఎంటర్‌ అయిన ఫొని.. ఇవాళ
బెంగాల్‌లోకి ప్రవేశించింది. సాయంత్రం వరకు అది బంగ్లాదేశ్‌ విూదగా మరింత బలహీనపడి హిమాలయాల్లోకి ప్రవేశించనున్నది. ఫొని తుఫాన్‌ వల్ల ఒడిశాలో సుమారు 15 మంది మరణించినట్లు తెలుస్తోంది.