5 నుంచి ఆంధ్రా బస్సుల బంద్‌

48 గంటల బంద్‌ విజయవంతం

14న ఢిల్లీ తరలిరండి: ‘పోలవరం’ పోరాట కమిటీ

భద్రాచలం(జ‌నంసాక్షి) : పోలవరం ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేస్తూ.. గురువారం నుంచి 48 గంటల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాల బంద్‌ తొలి రోజు విజయవంతమైంది. పోలవరం ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ పిలుపుమేరకు భద్రాచలం మండలంతోపాటు ఇతర ముంపు మండలాల్లో కార్యాలయాలను స్వచ్ఛందంగా మూసివేశారు. శుక్రవారం కూడా బంద్‌ కొనసాగిస్తామని పోరాట కమిటీ కన్వీనర్‌ వట్టం నారాయణదొర, కో కన్వీనర్‌ గుండు శరత్‌ తెలిపారు. కాగా.. ఆర్డినెన్స్‌ రద్దు కోరుతూ ఈ నెల 5,6,7 తేదీల్లో 72 గంటపాటు ఆంధ్రా బస్సుల నిలిపివేతకు పోరాట కమిటీ, అఖిలపక్షం పిలుపునిచ్చాయి. 14వ తేదీన ఆదివాసీ సంఘాల ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలిరావాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న కోరారు. కాగా మెడికల్‌ హెల్త్‌ ఆదివాసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌, పంచాయతీరాజ్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు.