70సీట్లతో బిజెపి అధికారం చేపడుతుంది


అక్బరుద్దీన్‌ మెడలు వంచుతాం
మెదక్‌ ప్రచార సభలో పరిపూర్ణానంద
మెదక్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి):  తెలంగాణలో 70 సీట్లు గెల్చి..  అక్బరుద్దీన్‌ మెడలు వంచేది తమ పార్టీయే అని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళలు మోదీ దగ్గరకు వచ్చి ట్రిపుల్‌ తలాక్‌పై నిర్ణయం తీసుకోమని కోరారని తెలిపారు. అప్పుడు మోదీ తలాక్‌ను తీసి వేయించి.. ముస్లిం మహిళలు తల ఎత్తుకునేలా చేసి.. అక్బరుద్దీన్‌ ఓవైసీకి ఝలక్‌ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అక్బరుద్దీన్‌ ఓవైసీనీ హైదరాబాద్‌లో తల దించుకుని తిరిగే రోజులోస్తాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే పేదవారికి రూ. 5 లక్షల రూపాలయతో వైద్యం, రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. సింగూరు మెదక్‌ ప్రజల హక్కని కానీ.. దాదాపు 15 టీఎంసీల నీటిని ఆక్రమంగా తరలించుకుపోయారని పరిపూర్ణానందా ఆరోపించారు. ఈ నీటిని పూర్తిగా మెదక్‌ ప్రజల తాగు, సాగు నీటి అవసరాల కోసం అందిస్తామన్నారు. కుంభకర్ణుడు కూడా 6 నెలలే పడుకుంటాడు.. కానీ కేసీఆర్‌ మాత్రం ఎప్పటికి నిద్ర పోతూనే ఉంటాడని ఎద్దేవా చేశారు. రామయం పేటను డివిజన్‌ కేంద్రంగా మారుస్తామనే మాట మరిచిపోయారని ఆరోపించారు. బీజేపీ గెలిస్తే ఇక్కడ పీజీ కాలేజీ, పాలిటెక్నికల్‌ కాలేజ్‌లు తీసుకోస్తామని పరిపూర్ణానందా హావిూ ఇచ్చారు. ఆడపడుచుల కళ్లల్లో కన్నీరు చూడొద్దనే ఉద్దేశంతోనే.. ఉజ్వల పథకం ద్వారా మోదీ ఇంటింటికి గ్యాస్‌ పొయ్యి అందించారని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పించే బాధ్యత బీజేపీదని పరిపూర్ణానంద తెలిపారు. మెదక్‌ నియోజకవర్గంలో 1,60,000 డబుల్‌ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని ప్రకటించారు. మోదీ ఇచ్చే 800 రూపాయలకు, రూ. 200 కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్‌ ఇచ్చిందని.. వాస్తవానికి కేసీఆర్‌ ఇచ్చేది రూ. 200 రూపాయలే అంటూ విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే మూసివేసిన ఎన్‌డీఎస్‌ఎల్‌ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు పది మంది పొట్టగొట్టే పార్టీలని ఆయన విమర్శించారు. జిల్లా కేంద్రంలోని చిల్డన్స్‌ పార్క్‌లో బీజేపీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరైన పరిపూర్ణానందస్వామి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.