మైనార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

ఫరూక్‌,శ్రవణ్‌లకు మంత్రి పదవులు

మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌

విప్‌గా చాంద్‌బాషా

అమరావతి,నవంబర్‌10(జ‌నంసాక్షి): శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, కిడారి శ్రవణ్‌లకు మంత్రి పదవుఉల ఖరారు కావడంతో మండలి చైర్మన్‌ పదవికి ఫరూక్‌ రాజీనామా చేశారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఇప్పటికే మంత్రి పదవి ఖరారు కాగా.. శాసనమండలి ఛైర్మన్‌గా షరీఫ్‌, అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా కదిరి ఎమ్మెల్యే చాంద్‌ బాషాను ఖరారు చేశారు. మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న ఫరూక్‌ శాసనమండలి ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వీరితో భేటీ అయ్యారు. మంత్రివర్గంలో అవకాశం ఇస్తున్నట్టు వారికి చెప్పారు. కెబినెట్‌ సహచరులతో పాటు జిల్లా నేతలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. కిడారి శ్రవణ్‌కు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. చిన్న వయస్కుడువైనా మంత్రిగా అవకాశం ఇస్తున్నామని, సద్వినియోగం చేసుకొని పార్టీకి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ముస్లి మైనార్టీ నేతలతో సీఎం భేటీ అయ్యారు. వారికి కీలక పదవులు ఇస్తూ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెదేపా ముస్లిం మైనార్టీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు వారికి మంత్రి వర్గంలో చోటుకల్పించే విషయంలో జాప్యం జరగడానికి కారణాలను వివరించారు. మంత్రి పదవులు ఆశించినా రాని ముస్లిం ఎమ్మెల్యేలకు భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని హావిూ ఇచ్చారు. జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జరపుతున్న పోరాటానికి మద్దతుగా ముస్లింలను సవిూకరించుకొని వెళ్లాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో మైనార్టీ నేతల భేటీ అనంతరం చాంద్‌ బాషా, షరీఫ్‌ విూడియాతో

మాట్లాడారు. తనకు ఏ పదవి ఇచ్చినా.. పార్టీ కోసం పనిచేస్తానని చాంద్‌బాషా అన్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తే.. గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయించరని సీఎం భావించినట్లు న్నారని, ఆ కారణంగానే తనకు విప్‌ పదవి ఇస్తున్నట్లు సీఎం చెప్పారని చాంద్‌ బాషా తెలిపారు. ముగ్గురు మైనార్టీ నేతలకు పదవులు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. పార్టీకి మైనార్టీల్లో అనుకూల వైఖరిని తీసుకొస్తామని తెలిపారు. తాను మంత్రి పదవిని ఆశించిన విషయం వాస్తవమేనని షరీఫ్‌ తెలిపారు. అయితే దానికంటే ఉన్నతమైన మండలి చైర్మన్‌ పదవి ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. పదవి కావాలని చంద్రబాబును తాను ఎప్పుడూ అడగలేదన్నారు. పార్టీకి తాను ఎప్పుడూ విధేయుడిగానే ఉంటానని అన్నారు. శాసన మండలి విలువలను కాపాడుతానని స్పష్టంచేశారు.