ఆఖరి చూపు

సిరిసిల్ల అక్కయ్య చనిపోయింది. ఫోన్‌ కాల్‌తో ఆలోచనలో పడిపొ య్యాను. నాకు అయిదుగురు అక్కలు. సిరిసిల్ల అక్కయ్య మా పెద్ద నాన్న కూతురు. ఆమె సిరిసిల్లలో వుంటుంది. కాబట్టి ఆమెని సిరిసిల్ల అక్కయ్య అనేవాళ్లం. మా సోదరిలని అక్క అనేవాణ్ని. కాని సిరిసిల్ల సోదరిని మాత్రం సిరిసిల్ల అక్కయ్యగా పిలిచేవాళ్లం. నేనే కాదు. మా ఇంట్లోని మా అక్కలు కూడా అలాగే పిలిచేవాళ్లు. మా ఇంట్లో వాళ్లందరి కన్నా పెద్ద మా అక్కయ్య. మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్‌ జరుగాలన్నా సిరిసిల్ల అక్కయ్య వుండాల్సిందే. అక్కయ్యే అన్నీ చూసుకునేది. సత్యనారాయణ వ్రతం దగ్గరి నుంచి పెళ్లి వర కు అన్నింటిలో ఆమె వచ్చిన తరువాతనే హడావిడి మొదలయ్యేది. పనులన్నీ సక్రమంగా జరిగేవి. పెళ్లికి నాలుగు రోజుల ముందు అక్కయ్య మా వూరొచ్చేది. పెళ్లి తరువాత నాలుగు రోజులకి వెళ్లిపొ య్యేది. సిరిసిల్ల అక్కయ్య లేకపోతే పనులు ఎలా జరుగుతాయో అన్పించేది. అలాంటి అక్కయ్య చనిపోయింది.ఎక్కడి అక్కయ్య. ఎక్కడ చనిపోయింది. మా పెదనాన్నకి పిల్లలు లేకపోతే మా అక్కయ్యని పెంచుకున్నాడు. ఆమె ఇంకో పెదనాన్న కూతురు. పుట్టింది ఒక వూర్లో.. పెరిగింది మరో వూర్లో.. చనిపోయింది హైదరాబాద్‌లో. మనిషి జీవితం ఓ నదిలాంటిదని అన్పిస్తుంది. ఎక్కడో మొదలై మరెక్కడో అంతమవడం. వెంటనే నేనూ మా ఆవిడా గాంధీనగర్‌కి వెళ్లినాము. మూడు గంటలవుతుంది. అంద రికీ సమాచారం వెళ్లింది. అన్నయ్య అమ్మ కరీంనగర్‌ నుంచి వచ్చారు. అక్కయ్య పిల్లలందరూ వున్నారు. కొంతకాలంగా అక్క య్య ఆరోగ్యం బాగోలేదు. ఎప్పుడు ఇలాంటి మాట వినిపిస్తుం దేమోనని అనుకుంటున్నదే అయినప్పటికీ, నది జీవితం సముద్రం లో కలువడంతో ముగిసినట్టు మనిషి జీవితం మృత్యువుతో ముగు స్తుందని తెలిసినప్పటికీ, అక్కయ్య శవం చూడగానే ఓ అంతులేని వేదన దు:ఖం.ఓ శోఖమయ వాతావరణం. బంధువులు స్నేహి తులూ అందరూ ఒకరొకరు వస్తూనే వున్నారు. కొంతమంది జరగబోయే పనులని చూస్తున్నారు. మరికొంత మంది దు:ఖంలో ఉన్న వ్యక్తులని ఓదార్చుతున్నారు. నేనే ఓ వేదనలో వుంటే ఎవరినని ఓదార్చేది? అక్కయ్య శవం పక్కన కూర్చున్నాను. అక్కయ్య అలాగే వుంది. నేను చిన్నప్పుడు చూసినట్టుగా మొఖం మీద ఎర్రటిబొట్టు ఇంకా వెలుగుతూనే వుంది. నన్ను చూసి పలకరింపుగా నవ్వినటు గానే వుంది.నాకు బాగా గుర్తు. ప్రతి దసరా తరువాత వచ్చే రథం పున్నమికి సిరిసిల్ల వెళ్లడం. దసరాకి మా వేములవాడ రథం పున్నమికి సిరిసిల్ల దేవుని రథం తిరగడానికి ఒక్కరోజు ముందుగా పొయ్యి రథం పున్నమి తరువాత తిరిగి రావడం. ఆ రోజు ఉదయం అక్కయ్యే అందరికీ స్నానం చేయించేది. ఒంటినిండా నూనె రాసి, సున్నిపిండి పెట్టి స్నానం చేయించేది. ఒళ్లంతా మర్ధన చేసినట్టుగా వుండేది. పెద్దమ్మ దగ్గర రెండు రూపాయిల నోట్లకట్ట వుండేది. టిఫిన్లు అయిన తరువాత అందరినీ పిలచేది. ఒక్కొక్కరికి రెండు రూపాయలు ఇచ్చేది. జాతరలో ఏమైనా కొనుక్కోవడానికి, పెద్దమ్మ చనిపోయిన తరువాత అక్కయ్య హైదరాబాద్‌కి వచ్చేసింది బావతో బాటు. అంతటి దు:ఖంలోనూ ఏవో జ్ఞాపకాల దొంతర కదులు తూనే వుంది. దాదాపుగా అందరు వచ్చినట్టున్నారు. ఏర్పాట్లు జరుగుతూనే వున్నాయి. ఎంతపెద్ద ఇల్లు సిరిసిల్లలో, ఎంత అట్టహా సంగా వుండేది ఆ ఇల్లు. ఓ ఇరువై మెట్లు దాటిన తరువాత పెద్ద కచేరి. అందులో పెద్దనాయన నిలువెత్తు ఫొటో. పక్కన పుస్తకాల అలమారా. మరో ఫొటోలో మిగతా న్యాయవాదులతో ఆయన దిగి న ఫొటో. బహుశా ఆ వాతావరణం నన్ను ‘లా’ చదవడానికి ప్రేరే పించిందేమో. నాకు తెలియకుండా నా మీద పడిన ప్రభావ మనుకుంటా. మా ఇంటి డాక్టర్‌ వాతావరణం కన్నా మా పెద్దనా యన ప్రభావం ఏదో నా మీద పడిందని ఇప్పటికీ అన్పిస్తుంది. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడల్లా ఓదార్చినప్పుడల్లా అందరిలోనూ దు:ఖం పెరుగుతూనే వుంది. అక్కయ్య హైదరాబాద్‌ వచ్చిన తరు వాత సిరిసిల్ల ప్రాభవం తగ్గిపోయింది. రథం పున్నమిలు జరు గుతూనే వున్నాయి. దేవుని రథం తిరుగుతూనే వుంది. కానీ రథం పున్నమికి వెళ్లడం లేదు. నిజానికి ఉద్యోగంలో చేరిన తరువాత అంతటైమూ లేదు. కానీ రథం పున్నమి జ్ఞాపకం అప్పుడప్పుడూ గుర్తుకొచ్చేది. ఈ ప్రపంచంలో కాలం అర్థమైనట్టే వుంటుంది. అర్థం కాదు. ఎన్ని మార్పులు తెస్తుందీ కాలం. ఎంత వేదనకి గురి చేస్తుందీ కాలం. ఎన్ని గాయాలని మాన్పుతుందీ కాలం. ఈ ప్రపంచంలో అత్యంత విచిత్రమైన విషయం కాలమే. మార్పులని ఆపగలమా? వాటితో పాటు తెలిసి, కొన్నిసార్లు తెలియక పరుగెత్తడం తప్ప. ఎక్కడి సిరిసిల్ల, ఎక్కడి రథం పున్న మి, ఎక్కడి హైదరాబాద్‌. ఎక్క డి అక్కయ్య, ఎక్కడి నేనూ, ఎక్కడి వేములవాడ. ఎక్కడి హిమాయత్‌నగర్‌.
అక్కయ్య వాళ్ల ఇల్లు చాలా పెద్దది. మా చిన్నప్పుడు ఆ ఇల్లే గొప్పగా అన్పించేది. మా ఇల్లూ పెద్దదే. కానీ అక్కయ్య వాళ్ల ఇల్లు చాలా ఎత్తు మీద వుండి రాజటీవి వొలకబోసేది. పెద్దిం టికి దూరంగా చిన్న ఇంటిలో వంటిల్లు వుండేది. రెండింటి మధ్య అరుగు వుండేది. ఈ రెండు ఇండ్లకి ఆవల చెట్లు వుండేవి. సంపెంగ చెట్టు కూడా వుండే ది. ఉదయాన్నే అక్కడికి వెళ్లడం ఓ గొప్ప అనుభూతి. సంపెంగ చెట్టు దగ్గర రెండు రూంలు వుండేవి. అందులో లక్ష్మి ఆమె భర్తా వుండేవాళ్లు. వాళ్లూ మా కు బంధువులే. అక్కయ్యకి పని లో సహా యంగా వుండేవాళ్లు. ఇక్కడ అవి ఏవీ లేవు. హైదరాబాద్‌ అందరికీ కేంద్రంగా మారింది. నా చిన్నప్పటి బంధువులు స్నేహితులు అందరూ ఇప్పుడు హైదరాబాద్‌లోనే కన్పిస్తున్నారు. ఐదు కావొ స్తుంది. హడావుడి ఎక్కువైంది. ఆరుగంటలు దాటితే బన్నీలాల ్‌పేటలో దహనం చెయ్యనివ్వరట. అందుకని కార్యక్రమాలు మొదల య్యాయి. ఇంకా రావాల్సిన వాళ్లు ఎవరైనా వున్నారేమో అంటున్న మాటలు విన్పిస్తున్నాయి. అందరూ వచ్చారు. అందని వాళ్లు బన్సీలాల్‌పేటకి వస్తారు అంటున్న మాటలు విన్పిస్తున్నాయి. స్నానం చేయించి కొత్త చీర కట్టి అక్కయ్య శవాన్ని ఇంటి ముందుకు తీసుకొ ని వచ్చారు. పాడె తయారైంది. వాహనాలు వచ్చాయి. అందరమూ బయటికి వచ్చాం. నేను సాధారణంగా చనిపోయిన వ్యక్తుల దగ్గరికి వెళ్లలేను. పాడెను మోయను. కాని అక్కయ్య చనిపోయినట్టుగా నాకు అన్పించలేదు. అనుకోకుండానే పాడెని మోసి వాహనం వైపు బయల్దేరాం. అక్కయ్య పిల్లలు బావ అందరం బయల్దేరాం. బన్సీలా ల్‌పేట చేరేసరికి ఆరున్నర అయ్యింది. కరీంనగర్‌ నుంచి రావల్సిన బంధువులు వచ్చారు. జరగాల్సిన పనులు అన్నీ జరిగిపోతూనే వున్నాయి. కట్టెల మీద అక్కయ్య శవాన్ని తీసుకొని పెట్టారు. అంద రమూ ఒక్కొక్కరమూ వచ్చి ఆ శరీరం మీద ఒక్కో గంధం చెక్కన వుంచుతూనే వున్నాం. చివరికి మొఖం మీద కూడా కప్పేశాం. అందరమూ అక్కయ్యని చివరిసారిగా చూశాం. శవాన్ని అంటించిన తరువాత కొంచెం దూరంగా వచ్చినిల్చున్నాం.సిరిసిల్ల నుంచి జీపు వచ్చింది. జీపు నుంచి దిగి లక్ష్మి పరుగు పరుగునా అక్కడికి వచ్చింది. అప్పుడే నిప్పుపెట్టిన అక్కడు కొడుకు అక్కడికి వచ్చాడు. అప్పటికే మంట పైకి లేస్తుంది. లక్ష్మి హతాశురాలైంది. అరే! ఎంత పని జరిగింది. ఓ ఐదు నిమిషాలు ముందు వచ్చినా బాగుండేది. దహన కార్యక్రమం ఓ ఐదు నిమిషాలు ఆలస్యం అయినా బాగుం డేదని అందరికీ అన్పించింది. లక్ష్మి ఎవరినో అలుముకొని శోఖం మొదలు పెట్టింది.
‘ఎంతపనైపోయింది అక్కయ్య
నా జీపు ఓ పది నిముషాలు ముందుగ ఎందుకు రాకపొయ్యే అక్కయ్య
నాకు ఓ గంట ముందు ఎందుకు తెలువక పొయ్యే అక్కయ్య
నీ పాణం మంచిగ లేదని తెల్సి
నిన్ననే ఎందుకు రాకపోతి అక్కయ్య
నిన్ను చూడకుండనే
నువ్వు పోవడ్తివా అక్కయ్య
నేనేం పాపం చేసిన అక్కయ్య
ఆఖరు సారి చూడకుండా
దేవుడు ఇట్ల ఎందుకు చేసిండు అక్కయ్య
నేను బతికినంత కాలం
నిన్ను ఆఖరు సారి చూడలేదని బాధ వుంటుందక్కయ్య’
ఆమె శోఖగీతం అంతులేకుండా కొనసాగింది. అక్క య్య చనిపోయిందన్న బాధ కన్నా ఎక్కువ ఆఖరిసారిగా అక్కయ్యను చూడలేకపొయ్యానని ఆమె బాధ, వేదన, దు:ఖం కాదు శోఖం ఒక్కసారి అక్కడున్న వాళ్ల బాధని రెట్టింపుచేసింది. మన స్మృతి నుంచి వ్యక్తులు పోనప్పటికీ ఆఖరి చూపు ఆఖరి చూపే. మొదటి చూపు ఎంతో ఆఖరి చూపూ అంతే అది సెంటిమెంటు కాదు. మనిషి మనస్సుకి సంబంధించిన అంశం. అందుకే చనిపోయిన ఆత్మీయులని చివరిసారి చూస్తాం. ఆమె ఏడ్పుతో ఓ కవిత గుర్తుకొచ్చింది.
సెంటిమెంటని కొట్టిపారెయ్యకు
మొదటి చూపు ఎంత అవసరమో
ఇదీ అంతే!
పుట్టిన పసిపాపను చూసే మొదటి చూపు
ఎలాంటిదో
ఇది అంతే!
అందులో ఎంత ప్రేమ వుందో – ఇందులోనూ అంతే!
ఇంకా చెప్పాలంటే
ఇందులో ప్రేమ వుంది ఆత్మీయత వుంది వేదన వుంది.
అందుకే –
మొదటి చూపు ఎంత అవసరమో
ఆఖరి చూపు అంతకన్నా ఎక్కువే అవసరం.