అందరి అభివృద్దిని కాంక్షించే వ్యక్తి శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్‌,మార్చి4 (జనం సాక్షి ) : అన్ని కులాలు, మతాలను సమానంగా చూసే వ్యక్తి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, అలాంటి వ్యక్తిని హత్య చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రపన్నడం దారుణమని జిల్లా రెడ్డి సంఘం నాయకులు అన్నారు. జిల్లా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మంత్రి పై జరిగిన హత్య కుట్రకు నిరసనగా విూడియా సమావేశంలో రెడ్డి నాయకులు మాట్లాడారు. మంత్రి జిల్లా అభివృద్ధి కోసం రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని అంతమొందించాలని కుట్రపన్నడం హేయమైన చర్యగా అభివర్ణించారు. నిందితులకు ఆవాసం కల్పించిన బీజేపీ నేత జితేందర్‌ రెడ్డి కూడా చట్ట ప్రకారం నిందితుడే అన్నారు. అకామిడేషన్‌కు షెల్టర్‌కు తేడా ఏంటో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. కిడ్పాప్‌ జరిగిందని ధర్నాలు చేసేది విూరే.. వాళ్లకు షెల్టర్‌ ఇచ్చేది విూరే.. అరెస్ట్‌ జరిగిందని నిందితులను గురించి మాట్లాడుతుంది విూరే అని బీజేపీ నేతల తీరును విమర్శించారు. రెడ్డి సంఘం తరపున ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.