అష్టదిగ్బంధనంలో పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌


తాలిబన్లతో పోరాటంలో అలసిన యోధులు
సాయం కోరినా స్పందించని ప్రపం దేశాలు
సంధికోసం యత్నిస్తున్న అహ్మద్‌ మసూద్‌
కాబూల్‌ విడిచి వెళుతున్న వారిని అడ్డుకుంటున్న మూకలు
కాబుల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్ఘాన్ల్‌ఓ తాలిబన్లు పట్టు బిగిస్తున్నారు. ఈ నెలాఖరుకల్లా అమెరికన్‌ దళాలు వెళ్లాల్సిందే అన్న అల్టిమేటం ఇచ్చారు. ఇప్పుడు తమను ఎదరించి..తమ సేనలను మట్టుబెట్టిన పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌ను కూడా గుప్పిట్లోకి తీసుకోబోతున్నారు. ఇన్నాళ్లూ శత్రు దుర్భేద్యంగా ఉన్న పంజ్‌షేర్‌ కోటకు బీటలు వారుతున్నాయి. ఆ ప్రాంత అధినేత అహ్మద్‌ మసూద్‌ ముందు ప్రస్తుతం రాజీపడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇక అఫ్గానిస్థాన్‌ యావత్తూ తాలిబన్ల వశం కానుందన్న సంకేతాలు వస్తున్నారు. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేక, అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం అందక.. తాలిబన్లకు లొంగిపోయే దిశగా మసూద్‌ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. కాబుల్‌కు ఉత్తరాన దాదాపు 150 కిలోవిూటర్ల దూరంలో ఉండే పంజ్‌షేర్‌ ప్రావిన్సు దశాబ్దాల నుంచి తాలిబన్లకు కొరకరాని కొయ్యే! హిందుకుష్‌ పర్వత శ్రేణుల్లోని ఈ ప్రాంతం శత్రు దుర్భేద్యం. 1980ల్లో సోవియట్‌ సేనలుగానీ, 1990ల్లో తాలిబన్లుగానీ దాన్ని ఆక్రమించుకోలేకపోయారు. పంజ్‌షేర్‌ సింహంగా పేరున్న అహ్మద్‌ షా మసూద్‌ నాటి పోరాటాల్లో ఈ ప్రావిన్సు బలగాలను ముందుండి నడిపించారు. ఆయన కుమారుడే అహ్మద్‌ మసూద్‌. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ఇటీవల మళ్లీ విజృంభించిన తాలిబన్లు అఎª`గాన్‌ మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు.. ఒక్క పంజ్‌షేర్‌ను తప్ప! పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్‌ మసూద్‌ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అప్గాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా సహా గత ప్రభుత్వంలోని పలువురు నేతలు పంజ్‌షేర్‌కే వచ్చేశారు. తాలిబన్లపై సాయుధ పోరుకు వారు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అమ్రుల్లా సలేప్‌ా సహా పలువురు నేతలతో ఇటీవల పలు దఫాలు చర్చలు జరిపిన 32 ఏళ్ల మసూద్‌.. తండ్రి బాటలోనే తానూ నడుస్తానని ప్రకటించారు. తాలిబన్లకు లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. తమ బలగాల సంఖ్య 6 వేలకు పైగానే ఉందని తెలిపారు. మళ్లీ పోరుబాట పట్టే సమయం వస్తుందని గ్రహించి.. తన తండ్రి హయాం నుంచే తాము ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చు కుంటున్నామని చెప్పారు. అయితే తాలిబన్లపై పోరుకు అవి సరిపోవని పేర్కొన్నారు. అంతర్జాతీయ మద్దతు అవసరమన్నారు. సహాయం చేయాల్సిందిగా ఫ్రాన్స్‌, ఐరోపా, అమెరికా, అరబ్‌ దేశాలను కోరారు. కానీ వాటి నుంచి స్పందన కరవైంది. తన గౌరవ మర్యాదలకు ఏమాత్రం భంగం కలగకుండానే లొంగిపోయి, తాలిబన్లతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా మసూద్‌ యోచిస్తున్నారని ఆయన సలహాదారుడొకరు తాజాగా ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో తెలిపారు. తాలిబన్లతో పంజ్‌షేర్‌ పోరాడలేదు. మాతో పోలిస్తే తాలిబన్ల బలం చాలా ఎక్కువ. 1980లు, 1990ల నాటి పరిస్థితులు వేరు. యుద్దాల్లో ఆరితేరిన ఫైటర్లు ఇప్పుడు తాలిబన్‌కు ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు` తాలిబన్లు ఇప్పటికే పంజ్‌షేర్‌ను చుట్టుముట్టారు. ఏ క్షణమైనా దాడులతో విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో రాజీ కుదుర్చు కునేందుకు మసూద్‌ ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఈ పరిస్థితి అనివార్యమైతే ఇక అఫ్ఘాన్‌ మొత్తం తాలిబన్ల చేతికిందకు వస్తుంది. ఇదిలావుంటే రాజధాని కాబుల్‌లోకి చొరబడిన తాలిబన్లు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపధ్యంలో అప్ఘనిస్తాన్‌ వాసులంతా కాబుల్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటున్నారు.
అక్కడి ఏదో ఒక విమానం పట్టుకుని, ఆ దేశం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబన్లు అప్ఘాన్‌వాసులను కాబుల్‌ ఎయిర్‌ పోర్టునకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. తాలిబన్‌ ప్రతినిధి జబీరుల్లా ముజాహిద్‌ విూడియాతో మాట్లాడుతూ తాము ఎయిర్‌ పోర్టునకు వెళ్లే దారులను మూసివేస్తు న్నామని, ఇకపై అఫ్ఘాన్‌వాసులు దేశం విడిచి వెళ్లలేరన్నారు. కేవలం విదేశీయులను మాత్రమే ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు అనుమతినిస్తున్నామన్నారు. అఫ్ఘాన్‌వాసులంతా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, తాలిబన్ల నుంచి వారికి ఎటువంటి హాని వాటిల్లదన్నారు.