ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ

ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూలను తప్పకుండా అమలు చేస్తామని అన్నారు. ఖమ్మం బస్‌ డిపోను సోమవారం ఉదయం సందర్శించారు. మంత్రికి ఆర్టీసీ కార్మికులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస్‌డిపో ఎదుట సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి అజయ్‌, కార్మికులు పాలాభిషేకం చేశారు. కార్మికులకు స్వీట్లు తినిపించారు.. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆర్టీసీ బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు రానున్న రోజుల్లో ఆర్టీసీ లాభాల బాటలో నడిపిస్తామన్నారు. ఆర్టీసీ కార్మికులకు సింగరేణి, విద్యుత్‌ ఉద్యోగుల స్థాయిలో భవిష్యత్‌ ఉంటుంది. కార్మికుల పిల్లల చదువులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని మంత్రి అజయ్‌ కుమార్‌ హావిూనిచ్చారు. వారికి ఉచిత విద్య అందిస్తామని అన్నారు.