ఆస్టేల్రియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ హఠాన్మరణం

గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారణ
న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): క్రీడారంగంలో కోలుకోని విషాం నెలకొంది. ఆస్టేల్రియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన విల్లాలో తీవ్ర గుండెనొప్పితో బాధపడుతూ మరణించినట్లు తెలుస్తోంది. షేన్‌ తన విల్లాలో అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించినట్లు డాక్టర్లు నిర్దారించారు. వార్న్‌ మరణ వార్త తెలిసి.. క్రికెట్‌ ప్రముఖులతో పాటు ఆయన ఫ్యాన్స్‌ దిగ్భార్రతి గురవుతున్నారు. మేటి స్పిన్నర్‌గా పేరుపొందిన షేన్‌ వార్న్‌ ఆస్టేల్రియా తరపున 1992లో టీమిండియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు తీశాడు. సమకాలీన క్రికెట్‌లో వెయ్యి వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా షేన్‌ వార్న్‌ నిలిచాడు. తొలి స్థానంలో లంక దిగ్గజ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఇక క్రికెట్‌లో లెక్కలేనన్ని రికార్డులు షేన్‌ వార్న్‌ సొంతం. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్ల హాల్‌ అందుకున్నాడు. అనూహ్యంగా బంతి తిప్పడంలో మేటి అయిన వార్న్‌.. 2013లో ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్‌తోనూ షేన్‌ వార్న్‌కు అనుబంధం ఉంది. 2008 ఆరంభ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టైటిల్‌ విజేతగా నిలవడంలో షేన్‌ వార్న్‌ కీలకపాత్ర పోషించాడు. ఇటీవల పుష్ప పాటకు డ్యాన్స్‌ చేసి అలరించాడు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.