ఎగువ కృష్ణా నుంచి వరదపోటు

జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద
జోగులాంబ గద్వాల,ఆగస్ట్‌5(జ‌నంసాక్షి): జోగులాంబ గద్వాల జిల్లా సవిూపంలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్‌ కు వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ఎగువన కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నదిలో వరద పోటు క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జూరాల ప్రాజెక్టుకు లక్షా 13వేల క్యూసెక్కుల వరద నీరువచ్చి చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండు కుండలా గరిష్ట నీటిమట్టానికి చేరుకోవడంతో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు వద్ద మొత్తం 27 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలానికి లక్షా 51 వేల 375 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రస్తుత నీటి సామర్థ్యం 8.790 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 విూటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 318.090 విూటర్లుగా నమోదు అయింది. వరద పోటు పెరగడంతో ఎగువ జూరాల జల విద్యుత్‌ కేంద్రంలో 6 యూనిట్లలో 234 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే దిగువ జూరాల జల విద్యుత్‌
కేంద్రంలోని 6 యూనిట్లలో 240 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.