ఎన్టీపిసి బూడితతో ప్రజలకు అనారోగ్యంకలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే

పెద్దపల్లి, ఫిబ్రవరి21 జ‌నంసాక్షి :  దేశానికి వెలుగులను ప్రసాదించే ఎన్టీపీసీ రామగుండం నియోజకవర్గం లోని కుందనపల్లి ప్రాంత ప్రజల జీవితాల్లో బూడిద కొడుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ విమర్శించారు. ఎన్టీపిసి నుంచి వచ్చే బూడిదతో కుందనపల్లి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని పేర్కొన్నారు.ఇప్పటికే తాము మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేతలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఇప్పటి వరకు కనీసం స్పందించలేదని ఆయన ఆరోపించారు. బూడిద సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే పాదయాత్రగా కలెక్టరేట్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కుందనపల్లి గ్రామ ప్రజలు, టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన పెద్దపల్లి కలెక్టర్‌ డాక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణకు సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు.. కుందనపల్లి గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.