ఎమ్మెల్యే నోముల అంత్యక్రియలు పూర్తి


సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో నిర్వహణ
నివాళి అర్పించిన సిఎం కెసిఆర్‌..మంత్రులు
అంతిమయాత్రకు భారీగా హాజరైన అభియానులు,నేతలు
నల్లగొండ,డిసెంబర్‌3(జనంసాక్షి) :  నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం పాలెంలో పూర్తయ్యాయి. వేలాదిగా తరలివచ్చిన
అబిమానులు, పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం ఉదయం 11:30 గంటలకు పాలెం చేరుకుని, నోముల భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. నోముల కుటుంబ సభ్యులను ఓదార్చారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు మహముద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, పలువురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. నోముల నర్సింహయ్య అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన పాలెంలో పూర్తయ్యాయి. ప్రగతిభవన్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సిఎం కెసిఆర్‌ నేరుగా నర్సింహయ్య అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. నోముల నర్సింహయ్య భార్య, కుమారుడిని ఓదార్చారు. సీఎం కేసీఆర్‌ చేరుకున్న కాసేపటికే అంత్యక్రియల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు వ్వయసాయ క్షేత్రం వరకు నోముల నర్సింహయ్య అంతిమయాత్ర చేపట్టారు.  ఉదయం నకిరేకల్‌లో నోముల నర్సింహయ్య అంతిమయాత్ర ప్రారంభమైంది. మెయిన్‌ రోడ్‌ నుంచి అంతిమయాత్ర సాగింది. తమ నేతకు తుది వీడ్కోలు పలికేందుకు భారీగా అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు కదలివచ్చారు.నోముల స్వగ్రామం పాలెంలోని వ్యవసాయ క్షేతంలో ప్రభుత్వ లాంఛనాల ప్రకారం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్న కెసిఆర్‌  గంటపాటు అక్కడే ఉన్నారు.  నోముల మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు.
ఈ అంత్యక్రియలలో జిల్లాకు చెందిన లీడర్లే కాకుండా.. రాష్ట్రంలోని పలువురు నాయకులు, అభిమానులు, సీపీఎం పార్టీ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడానికి ముందు నకిరేకల్‌ నియోజకవర్గంలో సీపీఎం పార్టీ నుంచి 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసే తత్వం కలవాడు కాబట్టి పేదల కష్టాలు ఆయనకు బాగా తెలుసు. అందుకే కష్టమంటూ తన దగ్గరికొచ్చిన ప్రతివారికి సాయం చేశాడు. ఆయన నకిరేకల్‌ నియోజకవర్గంలో తిరగని ఊరు లేదు. కాబట్టే ఆయనకు ప్రతి ఊరులోనూ అభిమానులు వేలసంఖ్యల్లో ఉంటారు.