ఐఐటిలో సీటు సాధించిన రాజూనాయక్‌


చదువుకు ఆర్తికసాయం అందిస్తామన్న కెటిఆర్‌
హైదరాబాద్‌,నవంబర్‌ 23జనంసాక్షి: దేశంలోనే ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటి భువనేశ్వర్‌లో సీటు సంపాదించిన రాజా నాయక్‌కు సాయం అందిస్తామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ట్వీట్‌ చేశారు. రాజా నాయక్‌ చదువుకు కావాల్సిన ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామని కెటిఆర్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. ఓ దినపత్రిలో వచ్చిన కథనాన్ని ఓ నెటిజన్‌ మంత్రి కెటిఆర్‌కు ట్యాగ్‌ చేయగా, ఆయన తక్షణమే స్పందించి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం జోడుబాయి తండాకు చెందిన రాజానాయక్‌ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతిచెందడంతో హైదరాబాద్‌లోని చిత్రలేఅవుట్‌ కాలనీలోని అనాథశ్రమంలో రాజానాయక్‌ పెరిగాడు. స్థానిక పాఠశాలలో చదివిన రాజానాయక్‌ పదో తరగతిలో 98 శాతం మార్కులు తెచ్చుకున్నాడు.అతని టాలెంట్‌ను చూసి దిల్‌సుఖ్‌నగర్‌లోని నారాయణ జూనియర్‌ కాలేజీ యాజమాన్యం ఇంటర్‌లో ఉచితంగా చేర్చుకుంది. ఈ నేపథ్యంలో రాజానాయక్‌కు ఇంటర్‌లో 96 శాతం మార్కులు రాగా, జేఈఈ మెయిన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబర్చి ఐఐటీ` భువనేశ్వర్లో కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో సీటు సాధించాడు. అయితే, 8 సెమిస్టర్ల చదువుకు రూ.6.74 లక్షలు, నాలుగేళ్‌ల్ల హాస్టల్‌, భోజన వసతికి రూ.1.60 లక్షలు, ఇతర ఖర్చులకు రూ.1.46 లక్షలు, అడ్మిషన్‌కు రూ.20 వేలు మొత్తంగా రూ.10 లక్షల వరకు ఖర్చు కానుంది. ఈ నెల 24వ తేదీ లోపు రూ.20 వేలు చెల్లించి రాజానాయక్‌ సీటు రిజర్వు చేసుకోవాల్సి ఉంది.
అంత డబ్బు కట్టలేక రాజానాయక్‌ దాతల సహాయాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కెటిఆర్‌ ఓ దినపత్రికలో వచ్చిన వార్తను చూసి రాజానాయక్‌కు ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామినిచ్చారు.