కాంగ్రెస్‌కు పూర్వవైభవం వరంగల్‌ సభతో జవసత్వాలు నింపుతా..

` రాహుల్‌ సభతో కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

` సన్నాహక సమావేశంలో టీపిసిసి చీఫ్‌ రేవంత్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):వరంగల్‌ సభతో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొస్తామని టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రైతుసంఘర్షణ సభతో తెలంగాణ ఆత్మగగౌరవాన్ని చాటుతామని అన్నారు. అధికార టిఆర్‌ఎస్‌ మెడుల వంచుతామన్నారు. టిఆర్‌ఎస్‌ అరాచాకాలను ప్రజలకు తెలియచేసి కెసిఆర్‌ను దోషిగా నిలబెడతామని అన్నారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్‌ గాంధీ పర్యటన నేపథ్యంలో శనివారం గాంధీభవన్‌ లో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే నెల 6న వరంగల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంఘర్షణ సభ జరగనుందని, ఈ సభకు రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. రాహుల్‌ సభతో కాంగ్రెస్‌ లో నూతనోత్తేజం వస్తుందన్న రేవంత్‌… సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే 20 ఏళ్ళ వరకు చర్చించుకునేలా వరంగల్‌ సభను నిర్వహించా లని పార్టీ శ్రేణులకు సూచించారు.  రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ మే 6, 7 తేదీల్లో రాహుల్‌ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వరంగల్‌లో బహిరంగ సభలు పెట్టి టీఆర్‌ఎస్‌ బలంగానే ఉందంటూ.. ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌దని ఎద్దేవా చేశారు. రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదులో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని, ఇప్పుడు వరంగల్‌ సభ కోసం కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. 2002లో వరంగల్‌ లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బీసీ గర్జన సభ జరిగిందని, ఆ సభకు సోనియా గాంధీ హాజరయ్యారని తెలిపారు. బీసీ గర్జన సభతో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. ఇప్పుడు రాహుల్‌ సభతో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ కేసీఆర్‌ అని, కేసీఆర్‌ నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు కాంగ్రెస్‌ పోరాడుతోందన్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రేవంత్‌ వాపోయారు.