కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి

జయశంకర్‌ భూపాలపల్లి, సెప్టెంబర్‌ 28 (జనం సాక్షి): గులాబ్‌ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. త్రివేణి సంగమంలో గోదావరి నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రాణహిత, గోదావరి నదులు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో కాళేశ్వరం వద్ద 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. ఈ ప్రవాహం 11.5 విూటర్ల ఎత్తులో కొనసాగుతోంది. నదీ ప్రవాహం ఇంత ఎక్కువగా ఉండటంతో మంగళవారం సాయంత్రం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.