కెసిఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవు

విద్యార్థులకు పురుగులన్నం పెడతారా
ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌,జూలై30(జనంసాక్షి):కేసీఆర్‌కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని మల్కాజ్‌ గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. మహబూబాబాద్‌ జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఇటీవల జరిగిన ఫుడ్‌ పాయిజన్‌ పై కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషితమైన ఆహారం తిని మొత్తం 36మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పై తీవ్ర విమర్శలు చేశారు. పురుగలన్నం పెట్టి పేదపిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి? అంటూ ఆగ్రహంచెందారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ కు భోగాలు తప్ప త్యాగాలు తెలియవని విమర్శించారు. అసలు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా అని ప్రశ్నించారు. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? అని దుయ్యబట్టారు. భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్‌ అంటూ రేవంత్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలలో కలుషితాహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు లోనవుతూనే ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ట్విట్టర్‌ వేదికగా… ‘పురుగలన్నం పెట్టి పేద పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే సర్కారును ఏ పదాలతో విమర్శించాలి?… భోగాలు తప్ప త్యాగాలు తెలియని కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులకు పిల్లల ప్రాణాల విలువ తెలుసా?.. పేద బిడ్డలకు నాణ్యమైన బుక్కెడు బువ్వ పెట్టలేని పాలన దేనికి? భోజనం తినేముందు ఆత్మపరిశీలన చేసుకో కేసీఆర్‌‘ అంటూ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు.