క్లీనర్‌ను హత్య చేసిన లారీ డ్రైవర్‌

స్వల్ప వివాదంతో క్లీనర్‌ హత్య

శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్‌

ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. కాకినాడకు చెందిన వీరిద్దరూ కరీంనగర్‌కు వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సినీ పక్కీలో క్లీనర్‌ మృతదేహంతో వచ్చి ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌లో డ్రైవర్‌ లొంగిపోయాడు. ఇదంతా చూసిన పోలీసులు విస్మయం చెందారు. పోలీసుల కథనం ప్రకారం…తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన డ్రైవర్‌ నైఫ్‌రాజు, క్లీనర్‌ రాజు నూకల లోడు కోసం కరీంనగర్‌ వచ్చారు. తిరుగు ప్రయాణంలో లారీ లోడుకు పట్టా కట్టే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో క్లీనర్‌ రాజును రాడ్‌తో కొట్టి కత్తితో పొడిచాడు. అనంతరం మృతదేహాన్ని లారీలో వేసుకుని కాకినాడ బయలుదేరారు. ఖమ్మం దాటగానే జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. హత్య చేసి లారీలో మృతదేహంతో సహా స్టేషన్‌కు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. డ్రైవర్‌ నైఫ్‌రాజు మాత్రం.. తన ప్రాణాలు కాపాడుకోవడానికే కత్తితో పొడిచానని, క్లీనర్‌ కత్తితో తనను హత్య చేయాలని చూశాడని చెబుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.