జంగ్‌సైరన్‌ విజయవంతం


మహబూబ్‌నగర్‌,అక్టోబరు 12(జనంసాక్షి):నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నింటినీ విస్మరించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అమిస్తాపూర్‌ లో నిర్వహించిన ‘విద్యార్థి`నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ సభకు కాంగ్రెస్‌ శ్రేణులు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్‌ మాట్లాడుతూ… ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేవరకు, పీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని పాలమూరు వేదికగా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన పాలమూరు ప్రాజెక్టులు తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తి చేసి ఉంటే ఈరోజు వాటిని పక్క రాష్ట్రం అక్రమప్రాజెక్టులు అనేదా?అని రేవంత్‌ ప్రశ్నించారు. కేసీఆర్‌ ఉమ్మడి పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఆరోపించారు. రూ.4వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ రావాలన్నా, లక్షా 91వేల ఉద్యోగాలు ఇవ్వాలన్నా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘ఉద్యోగాలు, విద్య, నదీ జలాలు.. ఇంకా అనేక వనరుల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. ఏడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు ఈ పాలకులు. నీళ్ల కోసం తెలంగాణ తెచ్చుకుంటే కృష్ణా నదిపై కట్టాల్సిన ఒక్క ప్రాజెక్టు కూడా కేసీఆర్‌ కట్టలేదు. కృష్ణ విూద పక్క రాష్ట్రం అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఏడాది కాలంగా నిద్రపోతున్నారు. కృష్ణా జలాలు తెలంగాణకు లేకుండా చేసేందుకు కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయపార్టీలతో కేసీఆర్‌ చర్చించాలి’’ అని భట్టి విక్రమార్క అన్నారు. ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ, వర్కింగ్‌ ప్రెసిడెంట్లు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, గీతారెడ్డి, ఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌, పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, సీనియర్‌ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు సభలో పాల్గొన్నారు.