జర్మనీలో కరోనా నిబంధనలు కఠినతరం

వ్యాక్సిన్‌ వేసుకున్న వారికే పబ్లిక్‌గా అనుమతి

బెర్లిన్‌,డిసెంబర్‌3  (జనంసాక్షి)  :  జర్మనీ కఠిన నిర్ణయం తీసుకున్నది. వ్యాక్సిన్‌ వేసుకోనివారిని.. పబ్లిక్‌గా తిరిగేందుకు అనుమతించడంలేదు. దేశంలో ఫోర్త్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛాన్సలర్‌ ఏంజిలా మెర్కల్‌ తెలిపారు. కేవలం వ్యాక్సిన్లు వేసుకున్న వారిని మాత్రమే.. ఇక నుంచి రెస్టారెంట్లు, సినిమాలు, షాపులు, పర్యాటక కేంద్రాలకు అనుమతించనున్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికీ టీకాలు తప్పనిసరి చేయనున్నారు. జర్మనీలో ఫోర్త్‌ వేవ్‌ నడుస్తోంది. గత 24 గంటల్లో 388 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒమిక్రాన్‌ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో మరింత టెన్షన్‌ వాతావరణం నెలకొన్నది.