జిల్లాల పేర్ల మార్పుపై మంత్రుల సవిూక్ష

ప్రజల నుంచి వచ్చి అభ్యంతరాలపై చర్చ
వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): కొత్త జిల్లాల పేర్ల మార్పుపై మంత్రులు సవిూక్ష నిర్వహించారు. వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా మారుస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్‌ కలెక్టరేట్‌ కార్యాలయంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సవిూక్ష నిర్వహించారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే టీ రాజయ్య, పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, వరంగల్‌ అర్బన్‌ జడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌ గాంధీ హన్మంతు, హరిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల పునర్వీభజనపై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకొని చర్యలు చేపట్టాలని సూచించారు. పరిపాలనా సౌలభ్యంతో పాటు కాకతీయుల చారిత్రక ప్రాశస్త్యం భవిష్యత్‌ తరాలకు అందించేందుకు వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల పేర్లను హన్మకొండ, వరంగల్‌ జిల్లాలుగా పేర్లు మారుస్తూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రెండు జిల్లాల పేర్ల మార్పునకు గత నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సూచనలను కోరుతూ నెల రోజులు సమయం ఇచ్చింది. ఇందులో 2027.89 చదరపు కిలోవిూటర్ల వైశాల్యంతో 9,63,975 జనాభాతో వరంగల్‌ జిల్లాగా.. 1466.23 చదరపు కిలోవిూటర్ల వైశాల్యం, 8,35,420 జనాభాతో హన్మకొండ జిల్లాలను ప్రతిపాదించింది. దీంతో ఆయా జిల్లాల్లోని ప్రజల నుంచి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా నుంచి 41, వరంగల్‌ అర్భన్‌ జిల్లా నుంచి 92 అభ్యరంతరాలు, సూచనలు వచ్చాయి.