జిల్లా అధికారి తనిఖీ చేసి మూసేస్తే..తెరిచి వైద్య పరీక్షలు చేస్తున్న నిర్వాహకులు.

* ప్రజలను పీడిస్తున్న ఆర్ యం పి లు

ఖమ్మం జిల్లా ‌.తిరుమలాయపాలెం( సెప్టెంబర్) 26 జనం సాక్షి
కూసుమంచి మండలంలోని పాలేరు, నాయకన్ గూడెం, కూసుమంచి, గైగొళ్లపల్లి, నర్సింహుల గూడెం .జీళ్ళచెరువు తదితర గ్రామాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు, రక్తపరీక్షలు చేసే ల్యాబ్లు ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులను ఆర్ఎంపీలు నడిపిస్తుండగా, ల్యాబ్లను ప్రైవేట్ టెక్నిషయన్స్ నడిపిస్తున్నారు. అయితే అందులో ప్రభుత్వ నిబంధనలకు తగ్గట్లుగా ఏ ఒక్క ఆసుపత్రి, ల్యాబ్లు నడవడం లేదు. ఇష్టానుసారంగా ఆసుపత్రులను, ల్యాబ్లను నడిపిస్తున్నారు.  ప్రస్తుతం కూసుమంచి మండల వ్యాప్తంగా  సీజనల్, మలేరియా, డెంగ్యూ జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఏ ఆసుపత్రి చూసిన జ్వరపీడితులతో కళకళలాడుతున్నాయి. ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, ఆర్ఎంపీలు ఇష్టానుసారంగా వైద్యసేవలను అందిస్తున్నట్లు సమాచారం.అంతే కాకుండా ఇష్టానుసారంగా బ్లెడ్ పరీక్షలు, ప్లేట్లైట్ పరీక్షలకు రాస్తుండటం, వాళ్లు స్థానికంగా ఉన్న ల్యాబ్లకు వెళ్లి పరీక్షలు చేయించడం జరుగుతుంది. ల్యాబ్ నిర్వహాకులు ఇష్టానుసారంగా దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ సమాచారం మేరకు ఈనెల16,17న జిల్లా వైద్యాధికారి(డీఎంఅండ్హెచ్వో) కళావతి బాయి  కూసుమంచి మండలంలోని పాలేరు, కూసుమంచి, నాయకన్గూడెం గ్రామాల్లో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులను, ల్యాబ్లను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని, ప్రభుత్వ వైద్యశాఖ నిబంధనలకు అనుగుణంగా లేని ప్రైవేట్ ఆసుపత్రులను తక్షణమే మూయించేశారు. ల్యాబ్లకు ఎలాంటి అనుమతి లేదని, నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆర్ఎంపీలు ప్రథమచికిత్స మాత్రమే చేసుకునే అవకాశం ఉంటుందని, వైద్యులు చేసే వైద్యాన్ని ప్రథమచికిత్సకేంద్రంలో చేయకూడదని ఆదేశాలిచ్చారు. అయితే ఏం జరిగిందో..? ఏమో కానీ కూసుమంచిలోని బాబునాయక్ ఆసుపత్రి, మరో ల్యామ్, పాలేరులోని శివసాయి క్లినిక్,  నాయకన్గూడెం గ్రామంలోని శ్రీలక్ష్మిదివ్య డయాగ్నస్టిక్ సెంటర్లు వెంటనే తెరుచుకున్నాయి. యదేచ్ఛగా తెరిచి పనులు చేస్తున్నారు. నాయకన్గూడెం ల్యాబ్లో పరీక్షలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంపై మండల వైద్యశాఖ ఉద్యోగులను వివరణ కోరగా  ఎలాంటి అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. మరి ఇప్పటికైన మండల వైద్యాధికారులు స్పందించి తక్షణమే తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటారని ప్రజలు కోరుతున్నారు.