టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన


న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని దేశాలు తమ జట్లను ప్రకటించాలని ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌) ఐసీసీ సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) టీ20 వరల్డ్‌ కప్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ప్రాబబుల్స్‌కు ఆరోన్‌ పించ్‌ సారధ్యం వహించనున్నాడు. వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ టూర్లకు దూరంగా ఉన్న స్టార్‌ ప్లేయర్స్‌ స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, ప్యాట్‌ కమిన్స్‌లాంటి వాళ్లు తిరిగి జట్టులోకి వచ్చారు. యువ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ జోష్‌ ఇంగ్లిస్‌ను టీమ్‌లోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాన వికెట్‌ కీపర్‌గా మాథ్యూ వేడ్‌ ఉండగా అనుభవం ఉన్న అలెక్స్‌ కేరీని కాదని బ్యాకప్‌గా ఇంగ్లిస్‌ను తీసుకున్నారు. యూఏఈ పిచ్‌లపై స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా కీలకం కానున్నాడు. అతడు ఐపీఎల్‌ 2020లో రాణించిన విషయం తెలిసిందే. జంపాకు తోడుగా మాక్స్‌వెల్‌ కూడా స్పిన్‌ బౌలింగ్‌ పంచుకోనున్నాడు. మరో స్పిన్నర్‌ మిచెల్‌ స్వీప్సన్‌కి కూడా క్రికెట్‌ ఆస్ట్రేలియా చోటిచ్చింది. ఒకవేళ జంపా గాయపడితే.. ఆస్ట్రేలియా స్వీప్సన్‌కి తుది జట్టులో చోటు కల్పించనుంది.ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ని అక్టోబరు 23న దక్షిణాఫ్రికాతో ఆడనుంది. 30న ఇంగ్లాండ్‌, నవంబరు 6న వెస్టిండీస్‌తో తలపడనుంది. క్వాలిఫయర్స్‌ నుంచి సూపర్‌-12లోకి రానున్న రెండు జట్లతో ఒక్కో మ్యాచ్‌ని ఆస్ట్రేలియా ఆడనుంది. టీ20 వరల్డ్‌కప్‌కు ఆస్ట్రేలియా టీమ్‌ : ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), ఆష్టన్‌ అగార్‌, ప్యాట్‌ కమిన్స్‌ (వైస్‌ కెప్టెన్‌), జోష్‌ హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టాయినిస్‌, మిచెల్‌ స్వెప్సన్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌ వార్నర్‌, ఆడమ్‌ జంపా