డబ్బులు డ్రా చేసి మరచిన వ్యక్తి

పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించిన మరో వ్యక్తి
నల్లగొండ,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ఏటీఎంలో డబ్బులు డ్రా చేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి డబ్బు తీసుకెళ్లకుండా అక్కడే వదిలి వెళ్లాడు. ఆ తర్వాత ఏటీఎంలోకి వచ్చిన నల్లగొండ పట్టణానికి చెందిన మున్వర్‌ షరీఫ్‌ అనే వ్యక్తి మిషన్‌లో డబ్బులు ఉండదాన్ని గమనించాడు. ఆ మొత్తాన్ని నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ లో అప్పగించి తన నిజాయితీని చాటుకున్నాడు. నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి పాతబస్తీ చౌరస్తా ప్రాంతంలో హెచ్‌.డి.ఎఫ్‌.సి. బ్యాంకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి వెళ్లిన మున్వర్‌ షరీఫ్‌ కు మిషన్‌ నుంచి 10,000 రూపాయలు బయట ఉండడం గమనించాడు. తన కన్నా ముందు వచ్చి వ్యక్తి డబ్బులు డ్రా చేసి తీసుకెళ్లడం మర్చిపోయాడని భావించి ఆ మొత్తాన్ని వన్‌ టౌన్‌ ఎస్‌.ఐ. నరేష్‌ కు అప్పగించాడు. నగదును మర్చిపోయిన వ్యక్తి పోలీస్‌ స్టేషన్లో సంప్రదిస్తే ఏటీఎంలోని సీసీ ఫుటేజ్‌ఉ పరిశీలించి నిర్దారణ చేసిన ఆనంతరం అప్పగిస్తామని ఎస్‌.ఐ. నరేష్‌ తెలిపారు. బాధ్యతాయుతంగా పోలీస్‌ స్టేషన్లో డబ్బులు అప్పగించిన మున్వర్‌ ను ఎస్‌.ఐ. నరేష్‌ అభినందించారు.