దళితబందు యూనిట్లు పంపిణీ చేసిన మంత్రులు


కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో నాలుగు యూనిట్లు అందచేత
కరీంనగర్‌,ఆగస్ట్‌26((జనంసాక్షి)): దళిత బంధు లబ్దిదారులకు రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ నాలుగు యూనిట్ల వాహనాలు అందజేశారు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో దళిత బంధు లబ్దిదారులకు మంత్రులు వాహనాలను అందజేశారు. లబ్దిదారులు దాసారపు స్వరూప రాజయ్య దంపతులకు ట్రాక్టర్‌, ఎలుకపల్లి కొమరమ్మ` కనకయ్య దంపతులకు ట్రాక్టర్‌, జి సుగుణ `మొగలి దంపతులకు ట్రాలీ, రాచపల్లి శంకర్‌ కు మారుతి కారును మంత్రులు అందజేశారు. సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహంగా, నిబద్దతతో పనిచేస్తుందని దీనికి చక్కని ఉదాహరణ దళిత బంధు పథకం అన్నారు. నిన్నటి వరకు డ్రైవర్‌గా పని చేసిన దళితుడు ఇవాళ అదే వాహనానికి ఓనర్‌ గా మారడం దళిత బంధు గొప్పతనాన్ని తెలియజేస్తుందన్నారు. దళిత బంధును కరీంనగర్‌ జిల్లాలోని హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ నెల 16 న ప్రారంభించి ఇదే నెలలో లబ్దిదారులకు వాహనాలు అందజేయడం అభినందనీయం అన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలోని 21 వేల దళిత కుటుంబాలు లబ్ది పొందనున్నాయని మంత్రులు తెలిపారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వీలు కల్పిస్తుందన్నారు. మొదటి విడుతగా దళిత బంధు ప్రారంభోత్సవంలో 15 చెక్కులను సీఎం అందించారని, నాలుగు యూనిట్ల క్రింద నేడు లబ్దిదారులకు 2 ట్రాక్టర్లు, ఒక ట్రాలీ, ఒక కారు అందజేసినట్లు తెలిపారు. దళిత బంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం, ధైర్యం దళితుల్లో కనబడిరదని మంత్రులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ వై. సునీల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి. కర్ణన్‌, రవాణా శాఖ ఉప కమిషనర్‌ ఎం.చంద్ర శేఖర్‌ గౌడ్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.