దుబ్బాకలో బావిలోకి దూసుకెళ్ళిన కారు`’

ముగ్గురు మృతి

దుబ్బాక,డిసెంబరు 1(జనంసాక్షి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లిన ఘటనలోముగ్గురు మృతి చెందారు.వెలికితీసిన కారులో ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా.. కారును బావి నుంచి బయటకు తీసేందుకు సహాయ చర్యల్లో పాల్గొన్న గజఈతగాడు కూడా మృతి చెందాడు. బుధవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం చిట్టాపూర్‌ వద్ద టైరు పేలడంతో కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. దాదాపు 6 గంటల పాటు కారును బావి నుంచి వెలికితీసేందకు సహాయక చర్యలు కొనసాగాయి. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కారును తీసేందకు ప్రయత్నించారు. రెండు మోటార్ల సాయంతో బావిలోని నీటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఘటనా స్థలికి చేరుకొని సహాయ చర్యలను పరిశీలించారు. బావిలో నుంచి కారును తీసేందుకు గజఈతగాళ్లు తీవ్రంగా శ్రమించారు. మోటార్ల సాయంతో బావిలోని నీరు కొంత మేర తీసేసిన అనంతరం బావి లోపల ఉన్న కారుకు గజఈతగాడు నర్సింహులు తాడును బిగించాడు. తాడు బిగించిన అనంతరం పైకి వచ్చే క్రమంలో కారుకు చిక్కుకుపోయి నర్సింహులు నీటిలోనే మృతిచెందాడు. మరోవైపు బావిలోకి దూసుకెళ్లిన కారులో నుంచి తల్లీకుమారుడు లక్ష్మీ, ప్రశాంత్‌ మృతదేహాలను వెలికి తీశారు. మృతులు మెదక్‌ జిల్లా నిజాంపేట మండలం నందిగామ వాసులుగా గుర్తించారు.