ధాన్యం కొనుగోలు చకచక


` కొనుగోలు కేంద్రాలు,ముమ్మరఏర్పాట్లు చేసిన రాష్ట్రప్రభుత్వం
` పాలనా యంత్రాంగం అటువైపే దృష్టి సారించాలి
` ధాన్యం మద్దతు ధరలకు కొనేలా చూడాలి
` ధాన్యం సేకరణ, రవాణాపై పక్కాగా చర్చలు
` జిల్లా కలెక్టర్లకు నిర్దేశించిన సిఎస్‌ సోమేశ్‌ కుమార్‌
హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):యాసంగి ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వమే కొంటుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో అందుసంబంధించిన ఏర్పాట్లు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. అధికార పాలనయంత్రంగా అంతా ధాన్యంకొనుగోలు కేంద్రం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్‌ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్‌, పౌర సరఫరాల అధికారులతో రాష్ట్రప్రభుత్వ ప్రధాని కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మొత్తం జిల్లా పాలనా యంత్రాంగాన్ని ధాన్యం కొనుగోలు లో నిమగ్నం చేయాలన్నారు. జిల్లా కలెక్టరేట్‌ లలో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి.రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌ లోను ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిపి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా అధికారుల తో వెంటనే సవిూక్ష సమావేశం నిర్వహించి సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజా ప్రతినిధులచే వెంటనే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కొనుగోలు కేంద్రాలను సందర్శించాలన్నారు. గత యాసంగి లో ఏర్పాటు చేసినన్ని కేంద్రాలు గానీ అంతకన్నా ఎక్కువైనా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలి.ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గన్ని బ్యాగుల సేకరణకై ప్రత్యేక దృష్టిని సాధించాలి. దీనికై ప్రత్యేక అధికారిని నియమించి తగు పర్యవేక్షణ చేయాలన్నారు. ధాన్యం క్వింటాల్‌ కు రూ.1960 కనీస మద్దతు ధర గా నిర్ణయించడం జరిగిందని అందుకు అనుగుణంగా కొనుగోలు చేయాలన్నారు. వ్యవసాయవిస్తరణ అధికారుల సేవలను ధాన్యం కొనుగోలులో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏవిధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలన్నారు. సేకరించిన ధాన్యాన్ని వెంటనే రవాణా చేసేందుకు తగు వాహనాల ఏర్పాట్లను చేసుకోవాలి. ప్రతీ రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలి. జిల్లాలో వారి కోతల వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉన్నాయి. వీటి ఆధారంగా తగు ప్రణాళిక రూపొందించుకోవాలి. పొరుగు రాష్టాల్ర నుండి ధాన్యం రాకుండా గట్టి చర్యలు చేపట్టాలి. దీనికై పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు, పంచాయితీ రాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పౌర సరఫరాల శాఖ కవిూషనర్‌ అనీల్‌ కుమార్‌, మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మిబాయిలు కూడా పాల్గొన్నారు.