నేడు హారతులు..రేపు పూజలు

నోములు, వ్రతాలు ఆదివారమే చేసుకోవాలంటున్న పండితులు

కొత్త అల్లుళ్లను పిలుచుకోవద్దని సూచన

యాదాద్రి భువనగిరి,నవంబర్‌13(జ‌నంసాక్షి): చతుర్దశి నాడు వేకువజామునే తైలాభ్యంగన స్నానం చేసే సంప్రదాయం అనాదిగా వస్తున్నది. అంతేకాదు, నువ్వుల నూనెలో లక్ష్మీ కళలు ఆవహించి ఉంటాయి. చతుర్దశి తెల్లవారు జామున నువ్వులతో తలంటుకొని తలస్నానం చేస్తే లక్ష్మీప్రదం. నరక దుర్గతి నుంచి విముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ప్రదోషకాలంలో దీపారాధన చేయాలి. ఈ దీపాలు లక్ష్మీకటాక్షం కలిగించడంతోపాటు పితృదేవతలకు నరకబాధను విముక్తిచేస్తాయని నమ్మకం.దీపావళి నాడు హారతులు ప్రధానమైన వేడుక. పుట్టింటికి వచ్చిన ఆడకూతుళ్లు ఇంట్లో ఉన్న మగవాళ్లందరికీ హారతులు

ఇస్తారు. సంప్రదాయబద్ధంగా కొనసాగే ఈ పక్రియ శనివారం సూర్యోదయానికి ముందుచేసుకోవాలని సిద్దాంతులు సెలవిస్తున్నారు. సూర్యోదయానికి ముందు కుదరని పక్షంలో, దుర్ముహూర్తం వెళ్లిపోయిన తర్వాత ఇవ్వొచ్చు. దుర్ముహూర్తం సూర్యోదయం నుంచి 1.36 గంటల నిడివి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో సూర్యోదయం అయ్యాక 1.36 గంటల తర్వాత హారతులు ఇవ్వొచ్చని సిద్దాంతులు సూచిస్తున్నారు. ఏటా అమావాస్య నాడు వచ్చే ఈ పండుగ ఈసారి రెండు రోజులపాటు జరుపుకోనున్నారు. అమావాస్య తిథి శని, ఆదివారాల్లో పరివ్యాప్తమై ఉన్నందున రెండురోజుల పర్వంగా మారింది. దీంతో హారతులు, లక్ష్మీపూజలు శనివారం, నోములు ఆదివారం చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి, అమావాస్య తిథులు శనివారం కలిసి వచ్చాయి. శనివారం చతుర్దశి తిథి పగలు 1.35 గంటల వరకు ఉన్నది. తర్వాత అమావాస్య తిథి ప్రవేశిస్తున్నది. రాత్రంతా అమావాస్య తిథి పరివ్యాప్తమై ఉండటంతో దీపావళి శనివారమే చేసుకోవాలి. అమావాస్య తిథి ఆదివారం ఉదయం 11.15 గంటల వరకు ఉన్నది.

ఫలితంగా దీపావళి సందర్భంగా నిర్వహించే వ్రతాలు ఆదివారం చేసుకోవాలన్నారు. నోముల విషయంలోనూ పండితులు పలు సూచనలు చేస్తున్నారు. లక్ష్మీపూజలకు ఎలాగైతే సాయంత్రం అమావాస్య ఉండాలన్న నియమం ఉన్నదో.. నోములు నిర్వహించాలంటే సూర్యోదయానికి అమావాస్య తిథి ఉండాలని చెప్తున్నారు. శనివారం సూర్యోదయానికి అమావాస్య తిథి లేకపోవడంతో.. శనివారం కేదారేశ్వర నోములు చేసుకోకూడదు. సూర్యోదయానికి అమావాస్య తిథి ఆదివారంనాడు ఉండటంతో అదే రోజు నోములు చేసుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. దీపావళి పండుగ విశేషాలలో ముఖ్యమైం ది లక్ష్మీపూజలు. వ్యాపారస్తులంతా దీపావళి సాయంత్రం లక్ష్మీదేవికి పూజలు చేసి, కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీపూజలతోనే కొత్త ఆర్థిక సంవత్సరాన్ని మొదలుపెడతారు. రాత్రిపూట అమావాస్య తిథి ఉన్నప్పుడే లక్ష్మీ పూజలు చేసుకోవాలని పండితులు చెప్తున్నారు. శనివారం సాయంత్రం లక్ష్మీపూజలు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీపావళికి కొత్త అల్లుడిని ఇంటికి పిలిచి కొత్తబట్టలు, కానుకలు సమర్పించే సంప్రదాయం తెలుగువారికి ఉంది. ఈసారి విశాఖలు ఉండటంతో కొత్త అల్లుళ్లు అత్తారింటికి వెళ్లకూడదని అంటుననారు. ఈ ఏడాది పెండ్లయిన వాళ్లందరికీ ఇది వర్తిస్తుంది. మొదటి ఏడాది దీపావళికి వెళ్లలేని పక్షంలో రెండో ఏడాది కూడా వెళ్లకూడదన్న ఆచారమున్నది. వేరే పండుగలకు, పబ్బాలకూ, ఇతర సందర్భాల్లోనూ అత్తగారింటికి వెళ్లడంలో ఎలాంటి ఇబ్బందీలేదు. కానీ, దీపావళికి వెళ్లాలంటే మాత్రం కొత్త అల్లుళ్లు మరో రెండేండ్లు ఆగాల్సిందే! ఇకపోతే ఈ ఏడాది కొత్తగా కేదారేశ్వర వ్రతాలు చేసుకోకూడదు. విశాఖలు ఉన్నందున పడిపోయిన వ్రతాలు తిరిగి మొదలు పెట్టడం గానీ, కొత్తగా వ్రతాలు ప్రారంభించడం గానీ చేయకూడదు. విశాఖ కార్తెలో దీపావళి రావడంతో కొత్త నోములకు ఆస్కారం లేకుండా పోయింది. ఇప్పటికే వ్రతాలు నిర్వహించేవారికి విశాఖలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.