నేత కార్మికులను దగా చేస్తున్న కేంద్రం

రాష్ట్రంలో అండగా నిలిచిన కెసిఆర్‌ ప్రభుత్వం
నేత సమస్యలపై బిజెపి నేతలు ఎందుకు మాట్లాడరు
విూడియా సమావేశంలో మండిపడ్డ టిఆర్‌ఎస్‌ నేత రమణ
హుజూరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి):  రాష్ట్రం నేత కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే కేంద్రం మాత్రం నడ్డివిరిచే ప్రయత్నాలు చేస్తోందని బిజెపిపై టీఆర్‌ఎస్‌ నేత ఎల్‌ రమణ విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా నేత కార్మికలు పరిస్థితి దయనీయంగా మారినా ఆదుకునే ప్రయత్నాలు జరగలేదన్నారు.
నూలు, చేనేత వస్త్రాలపై జీఎస్టీ వేస్తున్న కేంద్ర ప్రభుత్వం నేత కార్మికుల నడ్డి విరుస్తున్నదని రమణ అన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అన్ని విధాలా అండగా నిలుస్తున్నదని చెప్పారు. కేవలం తెలంగాణలో మాత్రమే నేత కార్మికులకు ప్రభుత్వ అండ దొరికిందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పథకాలన్నింటినీ ఎత్తివేస్తున్నదని విమర్శించారు. హుజూరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ఎల్‌ రమణ విూడియాతో మాట్లాడారు. అంబానీ, అదానీలకు వేల కోట్లు దోచిపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద నేత కార్మికుల సమస్యలపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రమణ ఆరోపించారు. ముడి సరికులపై సబ్సిడీ, థ్రిప్ట్‌ఫండ్‌, నేతన్నకు బీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటున్నదని చెప్పారు. తమ బతుకులు దుర్భరం చేసిన ఈటలకు నేతన్నలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఈ విషయాలు తెలిసీ మన బిజెపి నేతలు ఎందుకు నిలదీయడం లేదన్నారు.
ఈటల రాజేందర్‌ తన స్వప్రయోజనాల కోసం రాజీనామా చేశారని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ విమర్శించారు. ఈటల ఉద్దేశాన్ని ప్రజలు గమనించారని, ఈ నెల 30న తగిన తీర్పునిస్తారని అన్నారు. కేవలం స్వార్థ రాజకీయాల కోసం రాజీనామా చేసి, దానిని ప్రపంచ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం తగదన్నారు. ప్రజలకు టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ చేస్తున్న సంఓఏమ అభివృద్ది కార్యక్రమాలు బాగా తెలుసన్నారు. ద్రంలోని బీజేపీ నల్ల చట్టాలు తెచ్చిందన్న ఈటల ఆ పార్టీలో ఎలా చేరారని ప్రశ్నించారు. పద్మశాలీల ఆత్మగౌరవ భవనానికి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో రెండున్నర ఎకరాల స్థలం కేటాయిం చారని చెప్పారు. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై కేంద్రం ఎనలేని భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలు తగ్గిస్తామని బీజేపీ ప్రభుత్వం, ఈటల హావిూ ఇస్తారా అని ప్రశ్నించారు. బీసీ బిడ్డని అని చెప్పుకునే ఈటల రాజేందర్‌ బీసీలకు చేసిందేవిూ లేదన్నారు. హుజూరాబాద్‌లోని పద్మశాలీలు గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి గెలిపిస్తారని చెప్పారు. సంక్షేమం,అభివృద్ది టిఆర్‌ఎస్‌కు మాత్రమే సాధ్యమన్నారు.