ప్రభుత్వ స్కూళ్ల‌ను తీర్చిదిద్దటమే అన్నీ మంత్రి హ‌రీశ్‌రావు

 

 

 

 

 

సంగారెడ్డి : కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్ల‌ను తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమ‌ని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. ధళిత బంధు, మన ఊరు మన బడితో పాటు ప‌లు సంక్షేమ పథకాల అమ‌లుపై మంత్రి హరీష్‌రావు స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష స‌మావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, మహిపాల్ ‌రెడ్డి, భూపాల్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు షారుఖ్ హుసేన్, శేరి సుభాష్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, యాదవరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సంగారెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం రూ. 390 కోట్ల నిధులు విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ నిధులను ప్రజల అత్యంత అవసరమైన పనులకు ఉపయోగించే విధంగా ప్రతిపాదనలు రూపొందించే విధంగా ఎమ్మెల్యేలు చొరవ చూపాల‌న్నారు.

మన ఊరు-మన బడి ఒక అధ్బుతమైన పథకం, దీనిని వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని పాఠశాలలో ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరిస్తే పేద పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదివే అవకాశం కలుగుతుందన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రూ. 7,289 కోట్లు మన ఊరు మన బడికోసం మంజూరయ్యాయి, ఈ నిధులు సక్రమంగా వినియోగిస్తే విద్యా వ్యవస్థలో మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లాలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారని హ‌రీశ్‌రావు తెలిపారు. 9వ తేదీ నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పనులను ప్రారంభించాల‌ని ఆదేశించారు. స్కూళ్ల మరమ్మతులు, నిర్మాణాలకు ఇసుక కొరత లేకుండా ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు చూసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం కల్లా మన ఊరు మన బడికి పాఠశాలలను సిద్దం చేయాలి. మన ఊరు మన బడి కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో మన ఊరు -మన బడి కార్యక్రమం కింద 1,097 పాఠశాలల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు, జిల్లా పరిషత్ ఛైర్మన్‌లు, ఎమ్మెల్యేలు తమ ఒక నెల వేతనాన్ని డొనేట్ చేస్తున్నారని మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు.

దళితబందు కింద ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో 1156 మంది లబ్దిదారులకు రూ. 115 కోట్లు వినియోగించ‌నున్నామ‌ని తెలిపారు. దళితబంధు కార్యక్రమంలో ఎక్కవగా డెయిరీ యూనిట్లు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రోత్సహించండి. ఏ యూనిట్ ఇచ్చినా సక్రమంగా వినియోగించుకునే విధంగా ఎమ్మెల్యేలు, అధికారులు స్వయంగా లబ్దిదారులకు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని మంత్రి హ‌రీశ్‌రావు సూచించారు.