ప్రియాంక రెడ్డి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో అత్యంత దారుణం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఓ యువతిని సజీవ దహనం చేశారు. షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి గ్రామ శివారులోని రోడ్దు బ్రిడ్జి కింద పూర్తిగా తగలబడిన స్థితిలో యువతి మృతదేహం లభ్యమవ్వడం సంచలనం రేపుతోంది. మృతురాలు వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి గా గుర్తించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట్ మండలం కొల్లూర్ గ్రామంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని నర్సయిపల్లి గ్రామం ఆమె స్వస్థలం కాగా.. ప్రస్తుతం శంషాబాద్‌లో వీరి కుటుంబం నివసిస్తుంది.

రోజూలాగే స్కూటీ మీద ప్రియాంకారెడ్డి బుధవారం కూడా డ్యూటీకి వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో ఆమె స్కూటీ పాడైంది. దీంతో భయపడుతూ ప్రియాంక తనకు ఫోన్‌ చేసిందని మృతురాలి సోదరి మీడియాకు తెలిపారు. కొందరు లారీ డ్రైవర్లు స్కూటీని రిపేర్‌ చేయిస్తామని తీసుకెళ్లి.. దుకాణాలు మూసిఉన్నాయని మళ్లీ తీసుకొచ్చారని తనకు చెప్పిందన్నారు. అయితే భయంగా ఉందనడంతో అక్కడే ఉండవద్దని సమీపంలోని టోల్‌గేట్‌ వద్దకు వెళ్లమని తాను చెప్పినా.. వెళ్లలేదన్నారు. ఈ నేపథ్యంలో తన చెల్లెలు తిరిగిరాకపోవడం, ఇంతలోనే ఈ ఘోరం జరగడం తమను కలిచివేస్తోందని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. గుర్తుతెలియని దుండగులు ప్రియాంకపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ డ్రైవర్లు ఎక్కువగా సంచరించే ప్రాంతం కావడంతో వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.