భద్రాద్రిలో వైభవంగా శరన్నవరాత్రులు

భద్రాచలం,అక్టోబర్‌11(  జనంసాక్షి): భద్రాద్రి రామయ్య సన్నిధిలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన సోమవారం అమ్మవారు విజయలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం మహా నివేదన రాజభోగం నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు సామూహిక లక్ష కుంకుమార్చనలు జరిగాయి. రాత్రి 8 గంటలకు సీతారాముల నిత్యకల్యాణమూర్తులకు తిరువీధి సేవ నిర్వహిస్తారు. అమ్మవారు మంగళవారం ఐశ్వర్యలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తారు. చిత్రకూట మండపంలో శ్రీరామయణ పారాయణం, ప్రవచనాలు నిర్వహిస్తున్నారు.