భారత్‌,అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలి


` ఇరుదేశాల మధ్య ధృడమైన బంధం కోసమే ఈ చర్చలు
` అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వెల్లడి
` ఈ ద్వైపాక్షిక సమావేశం ఎంతో కీలకం
` వాణిజ్యభాగస్వామ్యం బలోపేతం కావాలి
` భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్ష
వాషింగ్టన్‌,సెప్టెంబరు 24(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. శ్వేతసౌధంలోని ఓవల్‌ ఆఫీస్‌లో ఇరువురు నేతలూ సమావేశమయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైన తర్వాత ఆయనతో మోదీ ద్వైపాక్షిక భేటీ కావడం ఇదే తొలిసారి. శ్వేతసౌధంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. జో బైడెన్‌ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. తొలిసారి జరిగిన ఈ ద్వైపాక్షిక భేటీలో కరోనాపై పోరాటం, వాతావరణ మార్పులు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంపై కీలకంగా చర్చించారు. అలాగే, అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించినట్టు సమాచారం.
ఇదో సరికొత్త అధ్యాయం.. బైడెన్‌
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్‌`అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో` అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోదీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను భారత్‌`అమెరికా బంధం పరిష్కరిస్తుందని తాను విశ్వసిస్తున్నట్టు బైడెన్‌ మోదీతో అన్నారు.
వాణిజ్య భాగస్వామ్యం బలోపేతం కావాలి.. మోదీ
అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ శతాబ్దం మూడో దశాబ్దం ప్రారంభంలో జరుగుతున్న ఈ దైపాక్షిక సమావేశం ఎంతో కీలకమైందన్నారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్‌`అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. సాంకేతికత ఓ ఛోదక శక్తిగా మారుతోందన్న ప్రధాని.. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. బైడెన్‌తో ఈ సమావేశం ఎంతో కీలకమైందని.. ఇరు దేశాలకు ఈ సమావేశం చాలా ముఖ్యమైందన్నారు. భారత్‌` అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయన్నారు.
మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లిన మోదీ.. బిజీబిజీగా గడుపుతున్నారు. మొదటి రోజు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, ఆస్ట్రేలియా, జపాన్‌ ప్రధానులతో మోదీ సమావేశమయ్యారు. ప్రముఖ సంస్థల సీఈఓలతోనూ ఆయన చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ రాత్రికి జరగబోయే క్వాడ్‌ సమ్మిట్‌లో మోదీ పాల్గొననున్నారు.