*మండల అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలి.

చిట్యాల25( జనం సాక్షి)  ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దావు వినోద వీరారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. వ్యవసాయం, విద్య, వైద్య, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఈజీఎస్, అంగన్ వాడి, పౌరసరఫరాల, ఐకెపి వివిధ శాఖల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, అధికారులు అందుబాటులో ఉండక పోవడంతో అనేక సమస్యలు గ్రామాల్లో పేరుకుపోయాయని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. పర్మినెంట్ ఏ ఈ లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతుందని తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఇంచార్జ్ ఏఈపై చర్యలు తీసుకోవాలని ఎన్పీడీసీఎల్ చైర్మన్ ,ఎస్సీలకు ఫిర్యాదు చేశారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల స్థాయిలో జరిగే సర్వసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, విధిగా హాజరు కావాలని కోరారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే సర్వసభ్య సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను అన్వేషించాలని అన్నారు. మండల సర్వసభ్య సమావేశం అంటే మినీ అసెంబ్లీ అని తెలిపారు. గ్రామాలకు కేటాయించిన పనులను విధిగా ప్రజా ప్రతినిధులు చేపట్టి పూర్తిచేయాలని సూచించారు. నిరు పేద ప్రజలకు సేవచేసే గురుతర బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని గుర్తు చేశారు.  అధికారులు,  ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల, జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు అంకితభావంతో పనిచేయాలని కోరారు. ఈసమావేశంలో జెడ్పిటిసి గొర్రె సాగర్ ,ఎంపీడీవో రామయ్య, పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ డి ఈ పరమేశ్వరి, ఏ ఈ  లు అనిల్ కుమార్, రవికుమార్, ఏవో రఘుపతి,ఏ పీ ఓ అలీమ్, ఏ పీ ఎం మంజుల, ఎం పీ ఓ రామకృష్ణ, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.