మన హైదరాబాద్‌లో మురుగునీరు శుద్ధినీరుగా మారుతుంది

` మురుగు నీటి శుద్ధి నగరంగా హైదరాబాద్‌ : మంత్రి కేటీఆర్‌
` ఫతేనగర్‌లో జలమండలి నిర్మిస్తున్న ఎస్టీపీల పరిశీలన
` జలమండలి సేఫ్టీ ప్రోటోకాల్‌ వాహనాలను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్‌(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఎస్టీపీ(మురుగు నీటి శుద్ధి కేంద్రం)ని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్టీపీల్లో వినియోగించే సాంకేతికతపై కేటీఆర్‌ ఆరా తీశారు. ఎస్టీపీ పనులు చేస్తున్న కార్మికులతో కేటీఆర్‌ మాట్లాడారు.హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులను పర్యవేక్షించినట్లు కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 1259 ఎంఎల్‌డీ కెపాసిటీతో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీలు 2023 ఎండకాలం నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. 100 శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్‌ మారబోతుందని కేటీఆర్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.నగరంలో జలమండలి పనులు చేపట్టే ప్రదేశాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించేందుకు గానూ రూపొందించిన సేఫ్టీ ప్రోటోకాల్‌ వాహనాలను శనివారం నానక్‌రాంగూడలో మున్సిపల్‌ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జెండా ఊపి ప్రారంభించారు.
సేఫ్టీ ప్రోటోకాల్‌ వ్యవస్థ వివరాలు
’’పని ప్రదేశంలో భద్రత.. ప్రజల భద్రత(వర్క్‌ సైట్‌  సేఫ్టీ ఈజ్‌ పబ్లిక్‌ సేఫ్టీ)’’ అనే నినాదంతో నగరంలో జలమండలి చేపట్టే వివిధ పనులు జరిగే ప్రదేశాల్లో భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షించేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసింది. జలమండలి చేపట్టే పైప్‌ లైన్‌ విస్తరణ, సీవరేజ్‌ పనులు, లీకేజీల నివారణ పనులు, మ్యాన్‌ హోల్‌ మరమ్మత్తులు, ఇలా ప్రతి పని ప్రదేశంలో భద్రతా చర్యలు కచ్చితంగా పాటించేలా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. సేఫ్టీ ప్రోటోకాల్‌ టీమ్స్‌(ఎస్పీటీ) పేరుతో ఆరు జలమండలి సర్కిళ్లకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో ఒక ఇంజనీర్‌, ఒక కానిస్టేబుల్‌, ఒక హోంగార్డు కమ్‌ డ్రైవర్‌ ఉంటారు. ఈ మొత్తం బృందాలకు చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ ఇంఛార్జిగా వ్యవహరిస్తారు.
సేఫ్టీ ప్రోటోకాల్‌ వ్యవస్థ ప్రత్యేకతల
ుఇక నుంచి నగరంలో జలమండలి చేపట్టే ప్రతి పనిని ఈ బృందాలు పరిశీలిస్తాయి. అక్కడ సేఫ్టీ ప్రోటోకాల్‌ ప్రకారం భద్రతా చర్యలు తీసుకుంటున్నారా, లేదా అనేది తనిఖీ చేస్తాయి. ఈ బృందాల కోసం సీఎస్‌ఆర్‌ నిధులతో ఆరు ఎస్పీటీ వాహనాలను(సేఫ్టీ ప్రోటోకాల్‌ టీమ్‌) ఏర్పాటుచేశారు. ఈ వాహనాలను మంత్రి కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ వాహనాల్లో పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఎక్కడైనా పని జరుగుతున్న ప్రదేశంలో రక్షణ పరికరాలు లేకపోయినా, బారీకెడ్లు ఏర్పాటు చేయకపోయినా ఈ బృందాలే ఏర్పాటు చేస్తాయి. రాత్రివేళల్లో పనులు జరిగే ప్రాంతాల్లో సరైన లైటింగ్‌, రేడియం సూచికల ఏర్పాటు తదితర భద్రతా చర్యలు పాటిస్తున్నారా, లేదా అనేది కూడా ఈ బృందాలు పర్యవేక్షిస్తాయి. పనులు జరుగుతున్న ప్రదేశాల జీఐఎస్‌ వివరాలు సైతం ఎస్పీటీలకు అందుతాయి. వీటి ఆధారంగానే ఈ బృందాలు పని ప్రదేశాలకు వెళ్లి తనిఖీలు చేస్తాయి. ఎస్పీటీ వాహనాలకు కెమెరా, బృందంలోని ఒక సభ్యుడికి బాడీ కెమెరా ఉంటాయి. వీటితో పాటు జీపీఎస్‌ ట్రాకింగ్‌ చేస్తూ నిరంతరం వీటిని సైతం పర్యవేక్షిస్తారు. పని ప్రదేశాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగవద్దనే ఆలోచనతోనే ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.
మూడు ప్యాకేజీల్లో 31 ఎస్టీపీల నిర్మాణం
నగరంలో 100 శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా జలమండలి చేపట్టిన 31 ఎస్టీపీల నిర్మాణం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం మూడు ప్యాకేజీల కింద నిత్యం 1257.50 ఎమ్మెల్డీల (మిలియన్‌ లీటర్‌ పర్‌ డే) మురుగు నీరు శుద్ధి చేయాలనే లక్ష్యంతో మొత్తం 31 మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) జలమండలి నిర్మిస్తోంది. ఇందులో భాగంగా ప్యాకేజీ`ఎ లో అల్వాల్‌, మల్కాజ్‌ గిరి, కాప్రా, ఉప్పల్‌ సర్కిల్‌ ప్రాంతాల్లో.. రూ.1230.21 కోట్లతో 8 ఎస్టీపీల నిర్మాణం జరుగుతోంది. వీటి మొత్తం సామర్థ్యం 402.50 ఎంఎల్‌డీలు. ప్యాకేజీ`ఎఎ లో రాజేంద్రనగర్‌, ఎల్బీ నగర్‌ సర్కిల్‌ ప్రాతాల్లో రూ. 1355.33 కోట్లతో 6 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. ఇక్కడ 480.50 ఎంఎల్‌డీల మురుగు నీటిని శుద్ధి చేస్తారు. ప్యాకేజీ`ఎఎఎ లో కూకట్‌ పల్లి, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి సర్కిల్‌ ప్రాంతాల్లో రూ.1280.87 కోట్ల వ్యయంతో 17 ఎస్టీపీలను నిర్మిస్తున్నారు. వీటి మొత్తం సామర్థ్యం 376.5 ఎంఎల్‌డీలు.
ఫతేనగర్‌ ఎస్టీపీ వివరాలు
ప్యాకేజీ`3లో భాగంగానే ఫతేనగర్‌ లో నిర్మించనున్న ఎస్టీపీకి గతంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంఖుస్థాపన చేశారు. 11 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఎస్టీపీ ద్వారా నిత్యం 133.0 ఎంఎల్‌డీల మురుగు నీరు శుద్ధి అవుతుంది. బాలానగర్‌, జీడిమెట్ల, కూకట్‌ పల్లి, సూరారం, జగద్గిరిగుట్ట నుండి వచ్చే మురుగును ఈ ఫతేనగర్‌ ఎస్టీపీలో శుద్ధి చేస్తారు. 2036వ సంవత్సరం వరకు ఇబ్బంది లేకుండా, 9.84 లక్షల జనాభాకు సరిపడా దీనిని నిర్మిస్తున్నారు. ఇందులో సీక్వెన్షియల్‌ బ్యాచ్‌ రియాక్టర్‌ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.