మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. వైద్య బృందం ఫ్లూయిడ్స్‌ ఇస్తున్నది. డాక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని ఎయిమ్స్‌ వైద్యుల బృందం మాజీ ప్రధానికి చికిత్సలు అందిస్తున్నది. జ్వరంతో పాటు శ్వాస సమస్యలు, చెస్ట్‌ పెయిన్‌ ఉన్నట్లు తెలుస్తున్నది.

మన్మోహన్‌ సింగ్‌ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా బారినపడ్డారు. జ్వరం ఉండడంతో ఎయిమ్స్‌లో చేర్పించిన సమయంలో కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. అంతకు ముందు మార్చి 4న, ఏప్రిల్‌ 3న కొవిడ్‌ టీకా తీసుకున్నారు. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత అయిన మన్మోహన్‌ సింగ్‌.. ప్రస్తుతం రాజస్థాన్‌ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2004-2014 వరకు భారత ప్రధానిగా సేవలందించారు. 2009లో ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు.