మెరుగైన వైద్యసేవలు అందించాలి

– ఏజెన్సీలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి
– ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌
– భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి
భద్రాచలం, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) : మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్‌ వ్యాధులు వచ్చాక వైద్య సేవలు అందించడం కంటే అవి ప్రబలకుండా ముందస్తు నియంత్రణ చర్యలు తీసుకునే విషయంలో వైద్య ఆరోగ్య సిబ్బంది పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని చూసే జిల్లా భద్రాద్రి జిల్లా అని అన్నారు. ఇలాంటి ఏజెన్సీ జిల్లాలో వైద్యసేవలు అందించే అవకాశం రావడం వరంగా భావించాలన్నారు. కష్టపడి వైద్యసేవలు అందజేస్తే వచ్చే తృప్తి మాటల్లో చెప్పలేనిదని అన్నారు. నెగెటివ్‌ ప్రచారాన్ని చూసి కుంగిపోవద్దని చెప్పారు. జిల్లాలో 137 డెంగీ కేసులు గుర్తించినప్పటికీ ఇప్పటివరకు ఈ సీజన్‌లో ఒక్క డెంగీ మరణం కూడా లేకుండా చేశారని వైద్య సిబ్బందిని అభినందించారు. ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడి టీచర్లతో కమిటీలు వేసి వ్యాధుల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  అనంతరం ఆస్పత్రి
పరిసరాలనఉ పరిశీలించారు. ఆస్పత్రిలో రోగులను పరామర్శించి మెరుగైన సేవలు అందుతున్నాయా లేదా అని తెలుసుకున్నారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు.