మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

ఆదిలాబాద్‌,అక్టోబర్‌2 జనం సాక్షి :  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. మేధావులను ఏనాడు పట్టించుకోకుండా, వారి ఆలోచనలను పంచుకోకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దన్నారు. ప్రజల ఎజెండానే తమకు ముఖ్యమని ఆయన తెలిపారు. ప్రజల ఆకాంక్షలైన నిధులు, నీళ్లు, ఉద్యోగాలే తమ ఎజెండా అన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నీరుగార్చిన టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదన్నారు. ప్రజలను నిజాం నిరంకుశ పానలలోకి తీసుకుని వెళ్లిన ఘనత కెసిఆర్‌దని అన్నారు. అందుబాటులో ప్రభుత్వం, ప్రజల మధ్య ప్రభుత్వం అనే నినాదంతో ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నామన్నారు. నియంతృత్వం కావాలో, ప్రజాస్వామ్యం కావాలో ప్రజలను తేల్చుకుంటారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిపై చర్చ చేస్తే ఏమేర అభివృద్ధి జరిగిందో తెలుస్తుందన్నారు. విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, పోరాట యోధులంతా టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.