రైతుపక్షపాతి సిఎం కెసిఆర్‌: ఎమ్మెల్యే

నల్లగొండ,నవంబర్‌28(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం రైతులకు చేయని విధంగా చర్యలు తీసుకున్నదని అన్నారు. ఉచితంగా సాగునీరు, ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం లాంటి పథకాలు ఎక్కడా లేవన్నారు. కొనుగోలు చేసిన భూములకు పట్టాలివ్వడం, నేడు రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేస్తూ రైతులకు రికార్డుల పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల ఇంటి వద్దకే పట్టాపుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. శ్రీరాంసాగర్‌ నీటితో వచ్చే ఏడాది ప్రతి చెరువును నింపుతామన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే నేడు ఇతర పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో భారీగా చేరుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్‌అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే ప్రజలను టీఆర్‌ఎస్‌లో చేరేలా ప్రేరేపిస్తున్నాయని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. పేదల అభ్యున్నతే లక్ష్యంగా అహర్నిషలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారని కొనియాడారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు.